షుగర్ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉండాలి

షుగర్ రోగులు తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయన్న భావనలో ఎక్కువగా తినకూడదు. డయాబెటిక్ రోగులు కొన్ని పండ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.


డయాబెటిస్ ముప్పు

​డయాబెటిస్ ముప్పు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు. భారతదేశంలో ఎక్కువ మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఇది క్రమంగా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. శరీరాన్ని బలహీనపరుస్తుంది. శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగిన తర్వాత దానిని కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతుంది. ఇక, డయాబెటిస్ రోగులు తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ ఆహారం పడితే అది తినకూడదు. తినకూడని ఆహారం తింటే రక్తంలో షుగర్ లెవల్స్ అదుపు తప్పుతాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలి.

ఏ పండ్లు తినకూడదు?

సాధారణంగా పండ్లు పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్యకరమైన ఆహారంలో ముఖ్యమైన భాగం. కానీ కొన్ని పండ్లు డయాబెటిస్ రోగులు తినకూడదు. అన్ని పండ్లలో ఫ్రక్టోజ్ అనే సహజ చక్కెర ఉంటుందని తెలిసిన విషయమే. అయితే, అన్ని పండ్లలో ఫ్రక్టోజ్ పరిమాణం ఒకేలా ఉండదు. కొన్ని పండ్లలో అధిక ఫ్రక్టోజ్ కంటెంట్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతుంది. డయాబెటిక్ రోగులు అధిక ఫ్రక్టోజ్ కంటెంట్ ఉన్న పండ్లకు దూరంగా ఉండాలి. ఆ పండ్లు ఏంటో తెలుసుకుందాం.

మామిడి

మామిడి పండ్లు తియ్యగా, రుచికరంగా ఉంటాయి. కానీ వాటిలో అధిక మొత్తంలో సహజ చక్కెరలు అంటే ఫ్రక్టోజ్, గ్లూకోజ్ ఉంటాయి. ఒక మధ్య తరహా మామిడి పండులో దాదాపు 25-30 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతాయి. దీంతో పాటు మామిడి పండులో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. మామిడి పండు గ్లైసెమిక్ ఇండెక్స్ 51-60 మధ్య ఉంటుంది. పెద్ద మొత్తంలో మామిడి పండు తినడం వల్ల గ్లైసెమిక్ లోడ్ (GL) పెరుగుతుంది. ఇది షుగర్ రోగులకు హానికరం.

అరటి పండు

చక్కెర రోగులు అరటిపండ్లను తినకూడదు. ఎందుకంటే అరటిపండ్లు అధిక గ్లైసెమిక్ ఇండెక్స్‌ను కలిగి ఉంటాయి. మధ్య తరహా అరటిపండ్లు 20-25 గ్రాముల కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి. పచ్చి అరటిపండ్లు తక్కువ GI విలువను కలిగి ఉంటాయి. అయితే పండిన అరటిపండ్లు అధిక GI విలువను కలిగి ఉంటాయి. అరటిపండు ఎక్కువగా తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ అమాంతం పెరుగుతాయి.

సీతాఫలం

షుగర్ రోగులు సీతాఫలాన్ని కూడా తినకూడదు. సీతాఫలం గ్లైసెమిక్ ఇండెక్స్ 54 నుంచి 56 వరకు ఉంటుంది. దీంతో పాటు 100 గ్రాముల సీతాఫలంలో దాదాపు 25-30 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇందులో సహజ చక్కెర అంటే ఫ్రక్టోజ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే, సీతాఫలాన్ని తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. సీతాఫలాన్ని ఎక్కువగా తినడం వల్ల అధిక చక్కెర స్థాయిలు ఏర్పడతాయి.

ద్రాక్ష

ద్రాక్షలో కూడా చాలా ఎక్కువ మొత్తంలో సహజ చక్కెర ఉంటుంది. ఒక కప్పు ద్రాక్షలో దాదాపు 23 గ్రాముల చక్కెర ఉంటుంది. అందుకే షుగర్ రోగులు ఈ పండు తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ద్రాక్ష యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ 46-59 మధ్య ఉంటుంది. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. అందుకే తక్కువ పరిమాణంలో తీసుకోవాలి.

పైనాపిల్

పైనాపిల్‌లో సహజ చక్కెరస కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఒక కప్పు పైనాపిల్‌లో దాదాపు 22 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. దాని GI విలువ మధ్యస్థంగా ఉన్నప్పటికీ అధికంగా తీసుకుంటే, అది రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతుంది. అందుకే పైనాపిల్ మితంగా డయాబెటిక్ పేషంట్లు తీసుకోవాలి.

పండ్లు తినేటప్పుడు గుర్తించుకోవాల్సిన విషయాలు

* ఒకేసారి ఎక్కువ పండ్లు తినకండి. 100 గ్రాముల కంటే ఎక్కువ పండ్లు తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

* భోజనంతో పాటు పండ్లు తినడం మానుకోండి.

* ఆహారంలో తాజా పండ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి.

* వీలైనంత వరకు, పండ్లను వాటి తొక్కతో సహా తినండి.

* పండ్ల రసంలో ఫైబర్ శాతం తక్కువగా ఉంటుంది. అందుకే పండ్ల జ్యూస్ తాగడం మానుకోండి.

* పండ్ల జామ్‌లో చక్కెర అధికంగా ఉంటుంది. అందుకే డయాబెటిక్ పేషంట్లు జామ్ అవాయిడ్ చేయండి.

* మధుమేహ రోగులు వారి ఆహారం గురించి డైటీషియన్‌ను సంప్రదించి తగిన సలహా తీసుకోండి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.