నగరంలోని శాంతిపురం వద్ద ఆర్టీసీ బస్సు దగ్ధమైంది షార్ట్సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. మంటలు గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేశాడు.
ప్రయాణికులంతా దిగిపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. మంటలు భారీగా చెలరేగడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. పెట్రోల్ బంక్ పక్కనే ఉండటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకొని రెండు వాహనాలతో మంటలార్పారు. బస్సు కూర్మన్నపాలెం నుంచి విజయనగరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి ప్రాణహాని జరగలేదని ఆర్టీసీ ఆర్ఎం అప్పలనాయుడు తెలిపారు. బస్సు సిబ్బంది వెంటనే గుర్తించి అప్రమత్తం చేశారన్నారు. ఈ ఘటనపై విచారణ చేయిస్తున్నట్లు పేర్కొన్నారు.
































