రేషన్కార్డు ఉన్నవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఇటీవలే కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన ప్రభుత్వం..
తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ షాపుల ద్వారా ఉల్లిపాయలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. రేషన్ కార్డు ధారులకు కిలో రూ.14కే ఉల్లిపాయలు అమ్మే విధంగా ఆదేశాలు జారీ చేసింది.
ఈ పంపిణీ ముందుగా కర్నూలు జిల్లాలో నేటి (శనివారం) నుంచి ప్రారంభిస్తారు. అలాగే రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా త్వరలో (వీలును బట్టి ఇవాళ.. లేని పక్షంలో ఒకటి రెండు రోజుల్లో) ఉల్లిపాయలు పంపిణీ చేస్తారు.
అయితే రేషన్కార్డులు ఉన్నవారికి ఎలాంటి పరిమితులు లేకుండా ఎన్ని కేజీలైనా కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించింది కూటమి ప్రభుత్వం. మొదటగా కర్నూలు సిటీలో ఉన్న 170 రేషన్ షాపుల్లో ఉల్లిపాయలు అమ్మడం ప్రారంభిస్తారు. ఈ విధంగా ఉల్లి రైతులకు న్యాయం చేసేందుకు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుందని మంత్రులు అంటున్నారు.
ఇటీవలే జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ ఉల్లి రైతులను ఆదుకునేందుకు మంత్రులు చర్చించినట్లు సమాచారం. ఆ సమావేశంలో జరిగిన సలహాలు, సూచనలు స్వీకరించి.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉల్లి రైతులు, వినియోగదారుల కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. కర్నూలు మార్కెట్లో మద్దతు ధరకు ఉల్లిపాయలను కొని.. వాటిని రైతు బజార్లకు పంపుతున్నారు.
కేవలం రేషన్ షాపుల్లోనే కాకుండా స్టూడెంట్ హాస్టల్స్, మధ్యాహ్న భోజన పథకం, అన్న క్యాంటీన్లకు తక్కువ ధరకే ఉల్లి అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్క్ఫెడ్ అధికారులు ఉల్లి కొంటుండటంతో వ్యాపారులు కూడా పోటీ పడుతున్నారు. దీనివల్ల ఉల్లి ధర తగ్గడం లేదు. అందుకే ప్రభుత్వం ఉల్లి రైతులకి, కొనేవాళ్ళకి కూడా ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటోంది.
































