ఏపీలో 4687 అంగన్వాడీలకు ప్రమోషన్… నోటిఫికేషన్ విడుదల

అంగన్వాడీల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందించడంతో పాటు పిల్లల శారీరక-మానసిక అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు.


అంగన్వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ సదుపాయాల కల్పనలో ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పథంలో సామాజిక న్యాయం కూడా సమానత్వానికి ప్రాముఖ్యతనిస్తూ ముందుకు సాగుతున్నామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖమంత్రి గుమ్మడి సంధ్యారాణి సమాధానం ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలలో 55,746 అంగన్వాడీ కేంద్రాలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటిలో 48,268 అంగన్వాడీ కార్యకర్తలు, 6,732 మినీ అంగన్వాడీ కార్యకర్తలు, 47,569 అంగన్వాడీ సహాయకులు సేవలందిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ఉద్యోగుల జీత భత్యాలు, సెలవులు ఇతరత్రా వివరాలను మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు.

అంగన్వాడీ సిబ్బందికి అందజేస్తున్న గౌరవ వేతనాలు:
• అంగన్వాడీ కార్యకర్తలకు – ₹11,500
• మినీ అంగన్వాడీ కార్యకర్తలకు – ₹7,000
• అంగన్వాడీ సహాయకులకు – ₹7,000

“2004లో తెలుగుదేశం ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినప్పుడు జీతం కేవలం ₹2,700 మాత్రమే ఉండగా, నారా చంద్రబాబునాయుడు దాన్ని ₹4,200కి పెంచారు. మరియు 2014లో తెలుగుదేశం ప్రభుత్వం మరల బాధ్యతలు చేపట్టినప్పుడు జీతం 4,200 నుండి 10,500కి పెంచారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం ₹1,000 మాత్రమే పెరిగింది. కానీ ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంది” అని మంత్రి సంధ్యారాణి స్పష్టం చేశారు.

అంగన్వాడీ వర్కర్లకు 180 రోజుల ప్రసూతి సెలవులు, 20 రోజుల వార్షిక సెలవులు, అలాగే మే నెలలో 15 రోజుల సెలవులు మంజూరు అవుతున్నాయి.

ప్రత్యేక పురస్కారాలు
• అంగన్వాడీ వర్కర్లకు – ₹50,000 అవార్డు
• అంగన్వాడీ సహాయకులకు – ₹40,000 అవార్డు
అలాగే ప్రశంసా పత్రాలు కూడా అందజేస్తున్నాము.

ప్రతి సంవత్సరం రెండు యూనిఫామ్ సెట్లు అందజేస్తున్నాము.

గ్రాట్యుటీ చెల్లింపులు:
• అంగన్వాడీ వర్కర్లకు – ₹1,00,000
• అంగన్వాడీ సహాయకులకు – ₹40,000

ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద విధి నిర్వహణలో మరణించిన పక్షంలో ₹2 లక్షల బీమా రక్షణ అందించబడుతుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 6,732 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, వాటిలో 5,000 మినీ అంగన్వాడీలను సాధారణ అంగన్వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేసినట్లు మంత్రివర్యులు తెలిపారు.

అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు కేవలం భోజనం మాత్రమే అందించడం కాకుండా, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్లే కిట్స్ కూడా అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ప్లే కిట్స్‌లోని బొమ్మల ద్వారా పిల్లలకు ఆటల రూపంలో చదువు నేర్పించడం, జ్ఞానం పెంపొందించడం, మరియు గుడ్ టచ్ బాడ్ టచ్ అవగాహన కల్పించడం జరుగుతోందని మంత్రివర్యులు వెల్లడించారు.

11,400 అంగన్వాడీ కేంద్రాలకు మంచినీటి సదుపాయం, 10,000 అంగన్వాడీలకు మరుగుదొడ్లు, 8,000 అంగన్వాడీలకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నామని మంత్రివర్యులు తెలిపారు. త్వరలో అంగన్వాడీలను శాశ్వత భవనాలుగా మారుస్తున్నాం అని పేర్కొన్నారు.

అంగన్వాడీ వర్కర్లపై మరియు కార్మికులపై ఉన్న కేసులను ప్రభుత్వం తొలగించే ప్రక్రియలో ఉందని తెలిపారు.

సొంత భవనం కలిగిన ప్రతి అంగన్వాడీకి ₹1,00,000 చొప్పున నిధులు కేటాయించబడతాయి. ఇందులో ప్రత్యేకంగా ₹10,000 పెరటి తోటల కోసం వినియోగించాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణిసూచించారు

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.