సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఎస్టీ ప్రయోజనాలను రాష్ట్రంలోని ఇంటింటికీ తీసుకెళ్లేలా కార్యాచరణ చేపట్టనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.
జీఎస్టీ 2.0 సంస్కరణల ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా విస్తృత ప్రచారం చేసేందుకు 65 వేల సమావేశాలు, కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే ఇంటింటికీ జీఎస్టీ ఫలాలు థీమ్తో నిత్యవసరాలు, ఔషధాలు, స్టేషనరీ, వస్త్రాలు, క్రీడా వస్తువులు, రవాణా, మహిళలు, చిన్నారులకు సంబంధించిన వస్తులపై పన్నులు తగ్గిన అంశాన్ని విస్తృతంగా ప్రచారం నిర్వహించినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో వీటిపై అవగాహన కల్పించినట్లు చెప్పారు.
జీఎస్టీ ఉత్సవ్పై ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉపసంఘంతో సోమవారం సీఎం తన క్యాంప్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అక్టోబర్ 19వ తేదీ వరకు వేర్వేరు థీమ్లతో ఈ ప్రచార కార్యక్రమాలపై కేబినెట్ కమిటీకి సీఎం చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు. అన్ని వర్గాలకు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలు తెలిసేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేపట్టినట్లు తెలిపారు. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 19వ తేదీ వరకు వ్యవసాయం, ఎంఎస్ఎంఈలు, చేనేత ఉత్పత్తులు, ఆక్వా, విద్యారంగం, బీమా, ఎలక్ట్రానిక్స్, ఈ కామర్స్, భవన నిర్మాణ రంగం, టూరిజం, ఆతిథ్య రంగం, రవాణా, లాజిస్టిక్స్, క్రీడా పరికరాలు, పునరుత్పాదక విద్యుత్, ఆటో మొబైల్స్, తదితర అంశాలపై రంగాల వారీగా ఆయా శాఖలు ప్రచారం చేపట్టాలని సీఎం సూచించారు.
రైతులకు అవగాహన కల్పించేలా ట్రాక్టర్ ర్యాలీలు, యంత్రాల ప్రదర్శన చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆప్కో, లేపాక్షి, ఒక జిల్లా-ఒక ఉత్పత్తి పేరిట మేళాలు, ఎంఎస్ఎంఈ యూనిట్లలో తయారయ్యే ఉత్పత్తులు, దానికి సంబంధించిన పన్నుల తగ్గింపుపై ప్రచారం నిర్వహించేలా చూడాలని ఆదేశించారు. సెలూన్లు, యోగా సెంటర్లు, జిమ్లలో జీఎస్టీల తగ్గింపు వల్ల ధరలు ఎంత వ్యత్యాసం వచ్చిందో అవగాహన కల్పించాలని సీఎం తెలిపారు.
జీఎస్టీ తగ్గింపుతో స్టేషనరీ ఉత్పత్తులపైనా ధరలు గణనీయంగా తగ్గిన అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సమావేశంలో ముఖ్యమంత్రి నిర్ణయించారు. అవగాహన కల్పించేలా విద్యార్థులకు వ్యాస రచన, పెయింటింగ్ పోటీలు నిర్వహించాలని చెప్పారు. రాష్ట్రంలోని 7 వేల ఉన్నత పాఠశాలలు, 4 వేల జూనియర్ కాలేజీల్లో ఈ ప్రచారం నిర్వహించేలా ప్రణాళిక సిద్దం చేశారు. జీవిత బీమా, ఆరోగ్య బీమాలకు సంబంధించి జీరో జీఎస్టీ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు.
జిల్లా స్థాయిలో దీపావళి సంబరాలు
జీఎస్టీ 2.0తో జరుగుతున్న లబ్ధిపై ప్రజలకు వివరించేలా వినూత్న రీతిలో కార్యక్రమాలను చేపట్టాలని.. అక్టోబర్ 18వ తేదీతో క్షేత్ర స్థాయిలో ప్రచారాన్ని ముగించి 19వ తేదీన జిల్లా కేంద్రాల్లో షాపింగ్ ఫెస్టివల్, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని సీఎం నిర్ణయించారు. అదే రోజున జిల్లా కేంద్రాల్లో దీపావళి సంబరాలు జరపాలని ఆదేశించారు.
































