ఏపీలో ఈ ఏడాది కూటమి సర్కార్ పెన్షన్ల లబ్దిదారుల జాబితాల్ని ప్రక్షాళన చేసింది. ఇందులో భారీ సంఖ్యలో అనర్హుల్ని తొలగించింది. అయితే వీరిలో పలువురు అర్హులు కూడా ఉన్నట్లు ప్రజాప్రతినిధులు తిరిగి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో వారికి మరో అవకాశం ఇచ్చేందుకు సిద్ధమైంది.
ఇందులో భాగంగా గతంలో తొలగించిన రెండు రకాల పెన్షన్ల లబ్దిదారుల్ని మరోసారి పరిశీలించి అర్హులు ఉంటే పింఛన్ సొమ్ము అందించేందుకు సిద్దమవుతోంది.
రాష్ట్రంలో ఈ ఏడాది జనవరి నెలలో ఆరోగ్య, దివ్యాంగుల పెన్షన్ల పరిశీలన చేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చింది. వీటి ప్రకారం ప్రభుత్వ ఆస్పత్రుల్లో జనవరి 6వ తేదీ నుంచి లబ్దిదారుల్ని పరిశీలించారు. ఇందులో 23352 ఆరోగ్య పెన్షన్లతో పాటు 5.22 లక్షల దివ్యాంగుల పెన్షన్లను పునఃపరిశీలించారు. ఇందులో అనర్హులుగా తేలిన వారికి నోటీసులు కూడా పంపారు. అలాగే వీరిలో అర్హులు ఉంటే అప్పీలు చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించారు. ఇప్పుడు వీరిలో అర్హుల గుర్తింపు కోసం ప్రభుత్వం ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది.
వీటి ప్రకారం గతంలో తొలగింపుకు గురైన ఆరోగ్య, దివ్యాంగ పెన్షన్ లబ్దిదారులు తిరిగి అప్పీలు చేసుకుని ఉంటే వారికి సచివాలయాల వారీగా పరిశీలన కోసం తేదీలు కేటాయించాలని ప్రభుత్వం ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించింది. జిల్లాల్లో డీసీహెచ్ఎస్, మెడికల్ సూపరింటెండెంట్ల సహకారంతో పెన్షన్ దారుల్ని ఆయా ఆస్పత్రులకు మ్యాప్ చేయాల్సి ఉంటుంది. వీరు ఏయే తేదీల్లో ఆస్పత్రులకు వెళ్లాలో తేదీలు ఖరారు చేయాలి. ఈ సమాచారం సచివాలయకు ఇవ్వాలి..
దీని ప్రకారం పంచాయతీ కార్యదర్శులు, వార్డు అడ్మిన్ కార్యదర్శులు అప్పీల్ చేసుకున్న లబ్దిదారులకు పెన్షన్ల పరిశీలన కోసం తేదీలు కేటాయిస్తారు. ఇందులో ఎవరైనా పెన్షన్ల పరిశీలనకు ఇచ్చే నోటీసు తీసుకోకున్నా, పరిశీలనకు రాకపోయినా వారి పెన్షన్ పెండింగ్ లో ఉంచుతారు. ఇప్పటికే ఈ మేరకు నోటీసుల పంపిణీ ప్రారంభం కాగా.. 8 నుంచి సచివాలయాల్లో పరిశీలన ప్రారంభమవుతుంది. బుధ, గురు, శుక్రవారాల్లో మాత్రమే సచివాలయాల్లో ఈ పెన్షన్ల పరిశీలన చేస్తారు. ఆరోగ్య పెన్షన్లర్లు మాత్రం ఆస్పత్రులకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ పరిశీలన పూర్తయ్యాక అర్హుల జాబితా ఇచ్చి పెన్షన్లు ఖరారు చేస్తారు.

































