రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టికెట్ రిజర్వేషన్ విధానంలో ఈ ఏడాది జూలై 1వ తేది నుంచి పలు సంస్కరణలు అమలు చేస్తోంది. టికెట్ల రిజర్వేషన్ లో దళారులకు అవకాశం లేకుండా..
నేరుగా ప్రయాణీకుడికే అందేలా కొత్త మార్పులు తెచ్చింది. ఇందు కోసం పారదర్శకత కోసం ఆధార్ తో అనుసంధానం చేస్తూ నిర్ణయించింది. కాగా, ఈ విధానం అమల్లో గుర్తించిన అంశాల మేరకు తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రైలు టికెట్ రిజర్వేషన్ సమయంలో ఈ విధానం అమలు కానుంది.
ప్రయాణీకుల టికెట్ రిజర్వేషన్ అంశంలో రైల్వే శాఖ మరో నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రైలు ప్రయాణం కోసం ఐఆర్సీటీసీ యాప్ / వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునేందుకు.. ఐఆర్సీటీసీ ఖాతాకు ఉన్న మొబైల్ నెంబరుతో ఆధార్ కార్డు లింక్ అయ్యేలా కార్యాచరణ రూపొందించింది. ఇప్పటి వరకు ఐఆర్సీటీసీ అకౌంట్ ఉంటే.. టికెట్లు రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు అమల్లో ఉంది. కాగా, కొందరు ఏజెంట్లు ఒక్కో ఖాతా నుంచి ఎక్కువ బుక్ చేస్తూ.. దుర్వినియోగానికి పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీనికి అడ్డుకట్ట వేయడానికి ఈ మార్పులు లను ఈనెల 1వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చింది. ఐఆర్సీటీసీ ఖాతాకు ఉన్న మొబైల్ నెంబరుతో ఆధార్ కార్డు అనుసంధానమైతేనే టికెట్ బుక్ అయ్యేలా మార్పు చేసింది.
ఇక.. ప్రయాణానికి ముందు రోజు అందుబాటులోకి వచ్చే తక్కువ సంఖ్యలో రిజర్వ్ చేసిన సీట్లపై కూడా నిబంధనలు విధించింది. ఈ టికెట్లను ఉదయం 10 గంటల నుంచి 11 గంటల నుంచి రిజర్వేషన్ చేసుకునేలా మార్పులు చేసింది. తాజాగా ఈ నెల 1 నుంచి సాధారణ రిజర్వేషన్ టికెట్లకూ ఇదే విధానాన్ని అమలులోకి తెచ్చింది.
ఐఆర్సీటీసీకి ఉన్న ఫోన్ నెంబరుతో ఆధార్ లింకప్ చేసుకుని ఉన్న ప్రయాణికులు ఉదయం 8 గంటలకు రిజర్వేషన్ టికెట్లు తీసుకునేలా… లింకప్ కానీ వారు ఉదయం 8.15 గంటల నుంచి తీసుకునేలా మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. దీని ద్వారా ప్రయాణీకులకు మరింత పారదర్శకంగా టికెట్లు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వివరించారు.
































