ఈ ఇంటర్నెట్ యుగంలో పిల్లల పెంపకం అనేది ప్రతి తల్లిదండ్రులకు అతిపెద్ద సవాలు. మొబైల్, సోషల్మీడియా వంటి వ్యసనాలకు లోనుకాకుండా జాగ్రత్త పడుతూ..ప్రయోజకులుగా తీర్చిదిద్దడం అంత ఈజీ కానప్పటికీ..అసాధ్యం మాత్రం కాదు.
ప్రతి పేరెంట్ తమ పిల్లలు మంచి ఉన్నత స్థాయిలో ఉండాలనే కోరుకుంటారు. దాంతోపాటు మంచి వ్యక్తిత్వం ఉండాలని ఆశిస్తారు. అందుకోసం ప్రతి తల్లిదండ్రులు ఈ ఐఏఎస్ అధికారిణి చెప్పే అద్భుతమైన పాఠాలను తెలుసుకోవాల్సిందే. ప్రతిదీ అందుబాటులో ఉండే ఈ కాలంలో పిల్లలను మంచిగా పెంచడం అనేది ఓ టాస్క్ మాత్రమే కాదు, ఏ మార్గాన్ని అనుసరించాలనేది కూడా గందరగోళమే అంటున్నారామె. తన తల్లి నుంచి నేర్చుకున్న ఆ అమూల్యమైన పాఠాలే తన ఇద్దరి కూతుళ్లను పెంచడానికి ఉపయోగ పడుతున్నాయంటూ 12 పేరెంటింగ్ పాఠాలను చెప్పుకొచ్చారామె. అవేంటంటే..
ఐఏఎస్ అధికారిణి దివ్య మిట్లల్ తన తల్లి ముగ్గురు పిల్లలను పెంచిందని, వారంతా జీవితంలో మంచిగా సెటిల్ అయ్యారని సోషలమీడియా ఎక్స్ పోస్ట్లో చెప్పుకొచ్చారు. ఆ పేరెంటింగ్ పాఠాలనే తాను నేర్చుకున్నానని, అనుసరిస్తున్నాని రాసుకొచ్చారామె పోస్ట్లో. అంతేగాదు సోషల్మీడియా వేదికగా ఇద్దరు కుమార్తెల తల్లిగా తన స్వంత అనుభవాల ఆధారంగా కొన్ని పేరెంటిగ్ సూచనలు కూడా అందించారామె. అవేంటంటే..
పిల్లలతో తరచుగా..
ఏదైనా సాధించగలవు అని చెప్పండి: తరుచుగా ఇలా అనడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందడమే గాక, క్లిష పరిస్థితుల్లో తట్టుకుని నిలబడేలా చేస్తుంది.
పడిపోనివ్వండి లేదా ఓటమిని ఎదుర్కొననివ్వండి: దీనివల్ల తప్పిదాలు తెలుసకోవడమే కాదు, తన కాళ్లపై ఎలా నిలబడాలో తెలుస్తుంది. పొంచి ఉండే ఆపదల నుంచి బయటపడటం ఎలా అనేది కూడా అలవడుతుంది.
పోటీ: పోటీ పడటానికి ప్రోత్సహించండి. అది ఆరోగ్యకరమైన విధంగా ఉండాలని చెప్పండి. దాంతో వైఫల్యాలనేవి జీవితంలో భాగం అనేది తెలుస్తుంది. తద్వారా సానుకూలంగా వ్యవహరించడం అలవాటు చేసుకోగలుగుతారు
రిస్క్ తీసుకోనివ్వండి: సాహసక్రీడల్లో పాల్గొనివ్వండి. గాయపడినప్పుడూ బాధ్యతాయుతంగా ఎలా వ్యవహరించాలో తెలుసుకోగలుగుతారు.
మీ ఆలోచనలు రుద్దకండి: మీకున్న ఉన్నని అవకాశాలు పొందలేకపోయామన్న నిరాశను వ్యక్తం చెయ్యొద్దు. అలాగే మీ ఆకాంక్షలను రుద్దొద్దు.
ఆదర్శంగా ఉండండి: మొదట మీరు ఆచారించే పిల్లలకు చెప్పాలి. అప్పుడే పేరెంట్స్ మాటపై వారికి విలువ, గురి ఉంటాయి.
మీ బిడ్డపై నమ్మకం ఉంచండి: ఆశ అనేది అందిరికి ముఖ్యం. ముందు మనం వారిని నమ్మకపోతే ఇంకెవ్వరు వారి సామర్థ్యాలను నమ్ముతారు. పిల్లలు ఎన్ని ఓటములు ఎదుర్కొంటున్న తల్లిదండ్రులుగా ఏదో ఒకనాడు గెలుపు అందుకుంటాడనే స్ట్రాంగ్ నమ్మకంతో ఉండాలి
పోల్చవద్దు: అతి పెద్ద తప్పు పోలిక. మీ పిల్లలను ఎవ్వరితోనూ పోల్చవద్దు.
వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి: స్వతహాగా ఎదగడం ముఖ్యం. కాబట్టి వారికి వారికి కొన్ని అనుభవాలను పొందే అవకాశం ఇవ్వాలి.
వినండి: పిల్లలు చెప్పే ప్రతీది ఓపికతో వినండి, తద్వారా వారు వినడం అనే అలవాటును అవర్చుకోగలుగుతారు.
సురక్షితంగా ఉన్నామనే భరోసా: పిల్లలు ధైర్యంగా ఉండేలా భరోసా ఇవ్వాలి. తమ భావాలను మనసు విప్పి చెప్పుకోగలిగే స్వేచ్ఛ ఇవ్వాలి. ప్రేమపూరిత వాతావరణం కల్పించాలి.
పైన చెప్పిన అన్నింటిని మనం పిల్లలకు అందిస్తే..తప్పకుండా ప్రయోజకులు అవ్వుతారని చెప్పుకొచ్చారు ఐఏఎస్ అధికారిణి దివ్య మిట్టల్. కాగా దివ్య మిట్టల్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ జీవిత పాఠాలపై యువతకు అమూల్యమైన సలహాలు సూచనలు అందిస్తున్నారు.
































