కళ్లు కలర్ఫుల్ పదార్థాల్ని కోరుకుంటాయి. ముక్కు ఘుమఘుమల్ని ఆస్వాదిస్తే.. నాలుక నోరూరించే రుచిని కోరుకుంటుంది. డాక్టర్లేమో రంగూ రుచీ వాసనల కంటే పోషకాలు ముఖ్యం అనేస్తారు. ఇవన్నీ గంపగుత్తగా ఒకే దగ్గర కావాలంటే చిరుధాన్యాలతో అద్భుత వంటలు చేసేయాలి!
కావలసినవి: రాగిపిండి – ముప్పావు కప్పు, ఓట్స్ పౌడర్, శనగపిండి – పావు కప్పు చొప్పున, కొకోవా పౌడర్, మిల్క్ పౌడర్ – 2 టేబుల్ స్పూన్ల చొప్పున, బేకింగ్ సోడా – స్పూన్, యాలకుల పొడి – పావు చెంచా, ఉప్పు – చిటికెడు, నెయ్యి, బెల్లం పొడి, పాలు – పావు కప్పు చొప్పున
తయారీ: వెడల్పాటి పాత్రలో రాగిపిండి, ఓట్స్ పౌడర్, శనగపిండి, కొకోవా పౌడర్, మిల్క్ పౌడర్, బేకింగ్ సోడా, యాలకుల పొడి, ఉప్పు వేసి కలపాలి. అందులో బెల్లంపొడి, నెయ్యి జోడించి.. కొద్దికొద్దిగా పాలు పోస్తూ కలపాలి. మెత్తటి పిండి తయారయ్యాక.. రిఫ్రిజిరేటర్లో ఉంచాలి. అరగంట తర్వాత బయటకు తీసి.. నిమ్మకాయంత భాగాలుగా విడగొట్టి.. బిస్కెట్లలా చేయాలి. వాటిని బేకింగ్ ట్రేలో బటర్ పేపర్ మీద వరుసగా పేర్చి.. 325 డిగ్రీల ఫారెన్ హీట్ వద్ద అవెన్ను ప్రీహీట్ చేసి.. సుమారు పావుగంట బేక్ చేయాలి. పూర్తిగా చల్లారాక.. గాలి చొరబడని సీసాలో భద్రం చేసుకోవాలి.
































