ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్ పీఈటీ పరీక్షల షెడ్యుల్ విడుదల.. ఏ పరీక్ష ఎప్పుడంటే?

 రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్‌) కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2025 ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్‌ (పీఈటీ) షెడ్యూల్‌ను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) తాజాగా విడుదల చేసింది.


ఆర్‌పీఎఫ్‌ ఫలితాలు జూన్ 19న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించిన ఈ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి దశ అయిన ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV) లకు హాజరుకావాల్సి ఉంటుంది.

ఇందులో భాగంగా పీఈటీ పరీక్షలు నవంబర్ 13 నుంచి డిసెంబర్ 6 వరకు నిర్వహిస్తారు. ఈ మేరకు షెడ్యూల్‌ విడుదల చేసింది. రెండవ దశ అయిన పీఈటీ పరీక్షలకు మొత్తం 42,143 మంది అర్హత సాధించారు. పీఈటీ, పీఎంటీ, డీవీ కోసం ఈ-కాల్ లెటర్‌లను, పరీక్ష తేదీలకు కనీసం 2 వారాల ముందుగా వెబ్‌సైట్‌లో విడుదల చేస్తామని ఆర్‌ఆర్‌బీ వెల్లడించింది. అర్హత సాధించిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి వీటిని డౌన్‌లోడ్‌ చేసుకుని సంబంధిత తేదీల్లో పరీక్షలకు హాజరుకావాలని సూచించింది.

కాగా మొత్తం 4,208 కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) ఖాళీల భర్తీకి ఆర్‌ఆర్‌బీ ఈ నియామక ప్రక్రియ చేపట్టింది. పీఈటీ, పీఎంటీ లను క్లియర్ చేసిన అభ్యర్థులకు అదే రోజున డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. అందువల్ల పీఈటీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు తమతోపాటు వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి అవసరమైన అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు రెండు సెట్ల సెల్ఫ్‌ అటెస్టెడ్‌ జిరాక్స్‌ కాపీలను తమతోపాటు తప్పనిసరిగా తీసుకురావాలని స్పష్టం చేసింది. ఇతర వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.