ఏపీలో కొత్త ఎయిర్‌పోర్ట్.. 3.8 కిలోమీటర్ల అతి పెద్ద రన్ వే, తొలి విమానం ఎగిరేందుకు ముహూర్తం ఫిక్స్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం సహకారంతో రాష్ట్రానికి ప్రాజెక్టులు, నిధులు తీసుకొస్తోంది. ముఖ్యంగా నేషనల్ హైవే ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఎయిర్‌పోర్ట్‌లు..


ఇలా వరుసగా రాష్ట్రానికి అవసరమైనవాటికి లైన్ క్లియర్ చేసుకుంటోంది. రాష్ట్రానికి పెట్టుబడుల్ని, కంపెనీలను రప్పించేందుకు కనెక్టివిటీపై ఫోకస్ పెట్టింది.. నేషనల్ హైవే ప్రాజెక్ట్ పనుల్ని వేగవంతం చేస్తూనే.. రాష్ట్రంలో కొత్త ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణాన్ని కూడా వేగవంతం చేస్తోంది. ఏపీలో కొత్తగా ఏడు ఎయిర్‌పోర్ట్‌లను ప్లాన్ చేస్తోంది.. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా.. కసరత్తు జరుగుతోంది. ఇదే క్రమంలో రాష్ట్రంలో కొత్తగా నిర్మాణంలో ఉన్న అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌పై ఫోకస్ పెట్టింది.. నిర్మాణ పనుల్లో వేగం పెంచారు.

విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మాణమవుతున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై తెలుగు దేశం పార్టీ అఫిషయల్ పేజ్‌లో ట్వీట్ చేశారు. ఎయిర్‌పోర్ట్ పనులు ఎంతవరకు వచ్చాయి.. ఎప్పుడు ప్రారంభించబోతున్నారో వీడియో రూపంలో తెలియజేశారు. దేశంలోనే అధునాతమైన అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులు 85 శాతం పైగా పూర్తి అయ్యాయని తెలిపారు. 3.8 కిలోమీటర్ల అతి పెద్ద రన్ వేతో ఈ ఎయిర్‌పోర్ట్ రూపుదిద్దుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టార్గెట్ ప్రకారం 2026 ఆగష్టు నాటికి ప్రారంభించే దిశగా పనులు సాగుతున్నాయి అన్నారు. వచ్చే ఏడాది విమానశ్రయం ప్రారంభం కావడం ఖాయమంటున్నారు.

ఈ ఏడాది జూన్ నెలలో భోగాపురం విమానాశ్రయంలో AAI (భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ) ట్రయల్ రన్ (సాంకేతిక పరీక్షలు) నిర్వహించిన సంగతి తెలిసిందే. భోగాపురం ఎయిర్‌పోర్టులో ATC (విమానాల రాకపోకలను నియంత్రించే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) టవర్ పనులు ముగింపు దశలో ఉన్నాయి. ఎయిర్‌పోర్టులో కీలకమైన రన్‌వే, సిగ్నల్ వ్యవస్థ వంటి పనులు కూడా చివరి దశలో ఉన్నాయి. ఈ క్రమంలో ఏటీసీ టవర్ నుంచి సిగ్నల్స్‌ కోసం AAI, DGCAలు చిన్న విమానంతో ఈ ట్రయల్ రన్ నిర్వహించారు. ఎయిర్‌పోర్ట్‌లో విమానం చక్కర్లు కొట్టింది. ఈ చిన్న విమానం రన్‌వేకు దగ్గరగా వచ్చి ల్యాండ్ అయ్యే ప్రయత్నం చేసింది.. మళ్లీ పైకి ఎగిరి వెళ్లిపోయింది. ఎయిర్‌పోర్ట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చక్కర్లు కొట్టి వెళ్లిపోయింది. విమానం ట్రయల్ రన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు విశాఖపట్నానికి కనెక్టవిటీపై ఫోకస్ పెట్టారు. భవిష్యత్ అవసరాలను గమనించి ముందుగానే నేషనల్ హైవేతో కనెక్టవిటీ కోసం అవసరమైన రోడ్ల నిర్మాణాలను చేపడుతున్నారు. అలాగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రాకతో విజయనగరం జిల్లా రూపురేఖలు మారిపోతున్నాయి. విమానాశ్రయానికి సమీపంలో కొన్ని ప్రాజెక్టులు రాబోతున్నాయి. ఇప్పటికే 80 ఎకరాల తీర ప్రాంతాన్ని పర్యాటక శాఖకు కేటాయించగా, ఇందులో 40 ఎకరాలు మై కేర్ సంస్థకు, మరో 40 ఎకరాలు ఒబెరాయ్ సంస్థకు అప్పగించారు. భోగాపురం, భీమిలి మండలాల్లో ఫైవ్ స్టార్ హోటళ్లు వెలవనున్నాయి.

విమానాశ్రయానికి సమీపంలోనే జీఎంఆర్ సంస్థ రూ.500 కోట్లతో ఒక ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించనుంది. ప్రైవేటు రిసార్ట్ యాజమాన్యం కూడా రూ.100 కోట్లతో బీచ్ ఫ్రంట్ రిసార్ట్ నిర్మాణ పనులు ప్రారంభించింది. సుమారు రూ.150 కోట్ల వ్యయంతో కన్వెన్షన్ సెంటర్ కూడా రానుంది. జిల్లా సరిహద్దులోని భీమిలి మండలంలో తాజ్ హోటల్ నిర్మాణానికి కూడా యాజమాన్యం ముందుకు వచ్చింది. గతంలో చింతపల్లి తీరంలో నిర్మించిన టూరిజం కాటేజీలను ఏపీ స్కూబా డైవింగ్ సంస్థకు కేటాయించారు. నాలుగున్నర ఎకరాల్లో ఉన్న ఈ కాటేజీల పునర్నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ అభివృద్ధి పనులన్నీ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ పర్యాటక మౌలిక సదుపాయాలను గణనీయంగా పెరగనున్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.