నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..! ఉద్యోగాలు, శిక్షణా అక్కడే..

యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తూనే, వారి ఉన్నత విద్యకు సహకరించేలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూసే వారి కోసం రూపొందించిన ‘నైపుణ్యం’ పోర్టల్ ఉద్యోగాల గేట్ వేగా ఉండాలని అధికారులకు సూచించారు.


2029 కల్లా 20 లక్షలు ఉద్యోగాలు అందించాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని సాకారం చేసేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఈ పోర్టల్ ను వైజాగ్ లో నవంబర్ లో జరిగే భాగస్వామ్య సదస్సుకు ముందే అందుబాటులోకి తేవాలన్నారు.

రాష్ట్రంలో ఇకపై ప్రతీ నెలా, ప్రతీ నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందిన వారికి ఇక నుంచి అధికారికంగా ధ్రువపత్రాలు జారీ చేయాలన్నారు. మరోవైపు క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ ద్వారా నైపుణ్యాలను పెంచేలా ప్రయత్నిస్తున్నామని… స్పేస్, ఆక్వా, క్వాంటం లాంటి రంగాల్లో సంస్థలు, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ అందించేలా కార్యాచరణ చేపట్టినట్టు మంత్రి లోకేష్ ముఖ్యమంత్రికి తెలిపారు. మొత్తం 15 క్లస్టర్ల ద్వారా పరిశ్రమలకు మానవ వనరుల్ని అందించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని సీఎంకు వివరించారు. ఈ విధానంపై ఆస్ట్రేలియాలో అధ్యయనం చేసి అమలు చేస్తున్నామన్నారు. దేశ విదేశాల్లో ఉద్యోగాలు ఎక్కడ లభిస్తున్నాయో అందరికీ తెలిసేలా నైపుణ్య పోర్టల్ అభివృద్ధి చేసి, నైపుణ్య కల్పనలో దేశ, విదేశీ సంస్థలను సంప్రదించాలన్నారు.

విశ్వవిద్యాలయాలు, జాతీయ-అంతర్జాతీయ విద్యా సంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకుంటే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఏ లబ్ది పొందకుండా నిరుద్యోగులుగా ఉన్నవారికి ప్రయోజనం చేకూర్చేలా నైపుణ్యం పోర్టల్ తీర్చిద్దాలన్నారు. అభ్యర్ధులు ఏ రంగంలో తమకు ఉద్యోగం, ఉపాధి కావాలని కోరుకుంటున్నారో… ఆ అవకాశాన్ని పొందేలే వివరాలు పోర్టల్‌లో పొందుపరచాలని సీఎం సూచించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నిర్వహించిన జాబ్ మేళాల ద్వారా 1,44,000 మందికి ఉద్యోగాలు లభించాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. నైపుణ్యం పోర్టల్ నుంచి ఏఐ ద్వారా అభ్యర్ధులు తమ రెజ్యూమ్ రూపొందించుకునే వెసులుబాటు కల్పించినట్టు వెల్లడించారు. వాట్సప్ ద్వారా ఉద్యోగావకాశాల గురించి సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తామని చెప్పారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి అన్ని శాఖలు, విభాగాల డేటా బేస్‌ సమీకృతం చేసి నిజమైన నిరుద్యోగులను గుర్తిస్తున్నామని అధికారులు వివరించారు. ఎక్కడ, ఏ రంగంలో శిక్షణ అందిస్తున్నాం, జాబ్ మేళాలు ఏ ప్రాంతంలో నిర్వహిస్తున్నాం, ఏయే సంస్థల్లో ఎలాంటి ఉద్యోగ ఖాళీలు ఉన్నాయనే దానిపై పోర్టల్ నుంచి అభ్యర్ధులకు సమాచారం అందేలా తీర్చిదిద్దామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.

ఉద్యోగార్దులు ఇంటర్వూలకు సిద్ధమయ్యేలా ఏఐ సిమ్యులేటర్‌ సైతం నైపుణ్యం పోర్టల్‌లో అందుబాటులో ఉందన్నారు. ఈ పోర్టల్‌లో ఐటీఐలు, పాలిటెక్నిక్‌లు, ఇంజినీరింగ్ కళాశాలలు, యూనివర్సిటీలు, వివిధ విద్యా సంస్థలతో పరిశ్రమలు, సంస్థలను అనుసంధానించి ఫ్యూచర్ ట్రెండ్స్ తెలిసేలా చేయాలన్నారు. ప్లేస్మెంట్ వివరాలనూ ట్రాకింగ్ చేసేలా ఉండాలన్నారు. స్కిల్ టెస్టింగ్‌కు కూడా అవకాశం కల్పించాలన్నారు. పాఠశాల స్థాయిలో విద్యార్ధుల నూతన ఆవిష్కరణలను మరింత ఉన్నతీకరించేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌తో అనుసంధానించాలని ఆదేశించారు.

విదేశాల్లో ఉద్యాగావకాశాలు సులభంగా పొందేందుకు వీలుగా ఆయా దేశాల స్థానిక భాషలను నేర్చుకునేలా శిక్షణ అందించాలన్నారు. ఏపీ ఎన్‌ఆర్టీ ద్వారా ఉద్యోగ సమాచారం పొందేలా చూడాలని ఆదేశించారు. నైపుణ్యం పోర్టల్ ద్వారా ఏపీలో యువత అందరికీ ఏ రంగంలో నైపుణ్యం కావాలో దానికి సంబంధించిన శిక్షణ… అలాగా ప్రస్తుతమున్న సామర్ధ్యాన్ని మెరుగుపరుచుకునేలా పున:శిక్షణ, ఉత్తమ శిక్షణ అందించాలన్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.