భారత ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థ మరోసారి ప్రధాన మార్పు దిశగా పయనిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ బ్యాంకుల విలీనం రెండో దశ (Bank Merger 2.0) కోసం ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఈ ప్రణాళిక అమలులోకి వస్తే దేశంలో కేవలం నాలుగు పెద్ద ప్రభుత్వ బ్యాంకులు మాత్రమే మిగిలే అవకాశం ఉంది. వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB), మరియు నరా బ్యాంక్ కీలక స్తంభాలుగా నిలవనున్నాయి. ఈ ఏకీకరణ ప్రధాన ఉద్దేశ్యం బ్యాంకింగ్ వ్యవస్థను మరింత బలపరచడం, మూలధన సామర్థ్యాన్ని పెంచడం, మరియు రుణాల మంజూరును వేగవంతం చేయడం.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
ఈ ప్రణాళిక ప్రకారం మధ్యతరహా బ్యాంకులైన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI), బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (BoM) లాంటి సంస్థలను పెద్ద బ్యాంకుల్లో విలీనం చేసే అవకాశం ఉంది. ఈ చర్యలతో రిస్క్ మేనేజ్మెంట్ బలపడుతుంది, ఆస్తుల నాణ్యత మెరుగుపడుతుంది, శాఖల పునర్వ్యవస్థీకరణ సులభమవుతుంది. 2019లో జరిగిన మొదటి దశ విలీనాల మాదిరిగా ఈ చర్య కూడా బ్యాంకింగ్ వ్యవస్థను సమర్థవంతంగా మార్చే దిశగా ఉంటుంది. అప్పట్లో 27 బ్యాంకులు 12కు తగ్గించబడ్డాయి. ఆ నిర్ణయం వల్ల బ్యాలెన్స్ షీట్లు బలపడి, డిజిటల్ వ్యవస్థలు వేగంగా అభివృద్ధి చెందాయి.
బ్యాంక్ విలీనం 2.0
ప్రభుత్వం ప్రస్తుతం పెద్ద, స్థిరమైన బ్యాంకులు దేశ ఆర్థిక వ్యవస్థకు అవసరమని భావిస్తోంది. పెద్ద బ్యాంకులు వనరులను సమర్థంగా వినియోగించగలవు, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడగలవు, అలాగే నిరర్థక ఆస్తుల (NPA) ఒత్తిడిని ఎదుర్కోగలవు. అయితే, ఈ విలీనాలకు సవాళ్లు కూడా ఉన్నాయి సిబ్బంది సమన్వయం, శాఖల తగ్గింపు, ఉద్యోగ భద్రత వంటి అంశాలు ముందుంటాయి. అయినప్పటికీ, బ్యాంక్ విలీనం 2.0 విజయవంతమైతే భారత బ్యాంకింగ్ రంగం మరింత స్థిరంగా, బలంగా మారి, $5 ట్రిలియన్ ఆర్థిక లక్ష్యాన్ని చేరుకునే దిశగా పెద్ద అడుగు వేస్తుంది.

































