ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానిక సంస్థలకు మరోసారి తీపికబురు చెప్పింది. 15వ ఆర్థిక సంఘం స్థానిక సంస్థలకు రూ.548.28 కోట్ల నిధుల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
టైడ్ గ్రాంట్ కింద జిల్లా, మండల పరిషత్లు, గ్రామ పంచాయతీలకు 2025-26 సంవత్సరానికి కేటాయించింది. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ను ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కేంద్రం 15వ ఆర్థిక సంఘం తొలి విడత నిధులను విడుదల చేసింది. ఏపీ పంచాయతీరాజ్ సంస్థలకు రూ.410 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో 13 జిల్లా పరిషత్లు, 650 మండల పరిషత్లు, 13,092 పంచాయతీలకు లబ్ధి చేకూరింది.
ఇటీవల ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఢిల్లీలో పర్యటించారు. ఆయన ఉన్నతాధికారులతో కలిసి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశం అయ్యారు. కేంద్ర పథకాల ద్వారా మున్సిపల్ శాఖకు సంబంధించి రావాల్సిన నిధుల కేటాయింపు, విడుదలపై కేంద్రమంత్రితో చర్చించారు. 15వ ఆర్థిక సంఘం పెండింగ్ నిధులు, అమృత్ పథకం నిధులు విడుదల చేయాలని మంత్రి నారాయణ కోరారు. మంత్రి నారాయణ రిక్వెస్ట్పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారు. ఏపీ ప్రభుత్వం కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులపై ఫోకస్ పెట్టారు.
రూ.2.40 కోట్లు విడుదలకు గ్రీన్సిగ్నల్
నర్సరీ, సీడ్ గార్డెన్ల ఏర్పాటుకు రూ.2.40 కోట్లు విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా కృషోన్నతి యోజన పథకం కింద నర్సరీలు, సీడ్ గార్డెన్లు ఏర్పాటు చేయడానికి ఈ నిధుల విడుదలకు ప్రభుత్వం పరిపాలన అనుమతులిచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ శాఖల పరిధిలో ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ గడువును ప్రభుత్వం పొడిగించింది. గతేడాది మార్చి 31తో ఈ గడువు ముగియగా.. తాజాగా దాన్ని 2026 మార్చి 31 వరకు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
































