ఈ ఏడాది జులై-సెప్టెంబరు త్రైమాసికంలో భారత స్మార్ట్ఫోన్ మార్కెట్ బలమైన వృద్ధిని నమోదు చేసింది. మార్కెట్ పరిశోధన సంస్థ ఐడీసీ (IDC) నివేదిక ప్రకారం..
ఈ త్రైమాసికంలో దేశీయ స్మార్ట్ఫోన్ మార్కెట్ 4.3% వృద్ధికి పైగా ఉండగా.. 4.8 కోట్ల యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. ఇది గత ఐదేళ్లలో భారీ అభివృద్ధిగా నమోదైంది. ఈ త్రైమాసికంలో చైనా స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ వివో 18.3% మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ప్రీమియం విభాగంలో ఆధిపత్యం చెలాయించే ఆపిల్ సంస్థ ఈ త్రైమాసికంలో 50 లక్షల ఐఫోన్ లను విక్రయించింది. ఒక త్రైమాసికంలో యాపిల్కు ఇవే అత్యధిక విక్రయాలని నివేదిక వెల్లడించింది.
ఇక రూ.50000 ధర ఉండే హై-ప్రీమియం విభాగంలో, అలాగే రూ.70,000 పైన ఉండే సూపర్ ప్రీమియం విభాగంలో ఆపిల్ సంస్థ అగ్రస్థానం సాధించింది. ప్రీమియం విభాగంలో అమ్మకాలు 43.3% వృద్ధి చెందడంతో యాపిల్ మార్కెట్ వాటా 4% నుంచి 6 శాతానికి పెరిగింది. ఇందులో 70% కంటే ఎక్కువ ఐఫోన్ 16, ఐఫోన్ 15, ఐఫోన్ 17 మోడళ్ల ద్వారానేరావడం గమనార్హం. ఇక సూపర్ ప్రీమియం విభాగం 52.9% వృద్ధి చెందడంతో దీని మార్కెట్ వాటా 6 నుంచి 8 cకి చేరుకుంది. ఈ విభాగాలలో 66 శాతం ఆపిల్, 31 శాతం వాటాతో శాంసంగ్ను అధిగమించింది.
ఇక ఎక్కువ స్పెసిఫికేషన్లు ఉన్న మోడళ్లకు ప్రజల నుంచి గిరాకీ పెరగడంతో.. గత త్రైమాసికంలో స్మార్ట్ఫోన్ సగటు విక్రయ ధర రికార్డు స్థాయిలో 294 డాలర్స్ (రూ. 26,000)కు చేరుకుంది. 2024 ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది 13.7% అధికం. దీని ద్వారా వినియోగదారులు మెరుగైన ఫీచర్లతో కూడిన స్మార్ట్ఫోన్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారని స్పష్టమవుతోంది.



































