వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (ttd) తీపి కబురు అందించింది. ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనాన్ని(Vaikuntha Dwara Darshan) డిసెంబర్ 30వ తేదీ నుంచి పది రోజుల పాటు కొనసాగించాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈసారి సాధారణ భక్తులకు అత్యధిక ప్రాధాన్యత కల్పించినట్లు ఆయన స్పష్టం చేశారు. పది రోజుల వైకుంఠ ద్వార దర్శనంలో మొత్తం 182 గంటల దర్శన సమయం ఉండగా, అందులో 164 గంటలను ప్రత్యేకంగా సాధారణ భక్తులకే కేటాయించినట్లు టీటీడీ ప్రకటించింది.
దర్శనం కేవలం..
మొదటి మూడు రోజులు (డిసెంబర్ 30, 31, జనవరి 1).. ఈ మూడు రోజులు ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనం మరియు శ్రీవాణి దర్శనాలు రద్దు చేయబడ్డాయి. దర్శనం కేవలం లక్కీ డిప్ ద్వారానే అనుమతించబడుతుంది. లక్కీ డిప్ రిజిస్ట్రేషన్లు నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా డిసెంబర్ 2వ తేదీన లక్కీ డిప్ ద్వారా ఎంపికైన భక్తులకు టోకెన్లు జారీ చేయబడతాయి. జనవరి 2 నుంచి జనవరి 8 రోజుల్లో రోజువారీగా 15 వేల రూ.300 దర్శన టిక్కెట్లు, ఒక వెయ్యి శ్రీవాణి దర్శన టిక్కెట్లు కేటాయించబడుతున్నాయి. ఈసారి స్థానిక భక్తులకు కూడా టీటీడీ ప్రత్యేక కేటాయింపులు చేసింది. జనవరి 6, 7, 8వ తేదీలలో రోజుకు 5,000 టోకెన్లను స్థానికులకు కేటాయించనున్నట్లు టీటీడీ వెల్లడించింది.































