ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను తాత్కాలికంగా తీర్చడానికి కొత్త ఆలోచన చేసింది.
స్కూళ్లలో కొత్తగా అకడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామించాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1,146 మంది సబ్జెక్టు టీచర్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లను (ఎస్జీటీ) నియమించనున్నారు. ఈ ఉద్యోగాల్లో చేరిన వారు ఈ నెల 8 నుంచి మే 7 వరకు.. అంటే ఐదు నెలల పాటు కొనసాగుతారు.
అకడమిక్ ఇన్స్ట్రక్టర్లలో సబ్జెక్టు టీచర్లకు నెలకు రూ.12,500.. ఎస్జీటీలకు రూ.10,000 గౌరవ వేతనం కింద ప్రభుత్వం చెల్లిస్తుంది. వాస్తవానికి ప్రభుత్వం మరో డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తోంది. ఒకవేళ జనవరిలో డీఎస్సీ ప్రకటన ఇచ్చినా.. కొత్త టీచర్లు విధుల్లో చేరాలంటే కనీసం జూన్ నెల ( 2026 అకడమిక్ ఇయర్) కూడా వచ్చేస్తుంది. ఈ లోపు బోధనలో ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ 1,146 పోస్టుల్లో 892 మంది సబ్జెక్టు టీచర్లు, 254 మంది ఎస్జీటీలను నియమిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం జాబితాను కూడా విడుదల చేసింది.
ఈ నెల 7వ తేదీలోపు ఈ అకడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా సేకరించిన ఖాళీల ఆధారంగా ఈ అనుమతులు మంజూరు చేశారు. ఈ తాత్కాలిక నియామకాలతో ప్రభుత్వం విద్యార్థులకు చదువులో ఇబ్బందులు లేకుండా చూస్తోంది. అయితే కొత్త డీఎస్సీ పరీక్షల ఫలితాలు రాగానే.. కొత్తగా టీచర్ల నియామకం జరిగే వరకు ఈ అకడమిక్ ఇన్స్ట్రక్టర్లు సేవలు అందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా అకడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామక ప్రక్రియ ప్రారంభమైంది. మండల విద్యాధికారులు (MEOలు) పాఠశాల, మాధ్యమం వారీగా అకడమిక్ ఇన్స్ట్రక్టర్ల పోస్టుల ఖాళీలను ప్రకటించారు.
ఈ నెల ఐదులోపు దరఖాస్తు చేస్కోండి
అకడమిక్ ఇన్స్ట్రక్టర్లకు అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 5వ తేదీ లోపు తమ దరఖాస్తులను సంబంధిత MEOలకు సమర్పించాలి. MEOలు స్వీకరించిన దరఖాస్తులన్నింటినీ జిల్లా విద్యాధికారులకు (DEOలు) పంపిస్తారు. జిల్లా విద్యాధికారులు అభ్యర్థుల మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియను చేపడతారు. అకడమిక్ అర్హతలకు 75% వెయిటేజీ, ప్రొఫెషనల్ అర్హతలకు 25% వెయిటేజీ కేటాయిస్తారు. తమ సొంత గ్రామం లేదా మండలంలో నివసించే అభ్యర్థులకు ఈ నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను సంబంధిత మండల విద్యాధికారుల ద్వారా పాఠశాల యాజమాన్య కమిటీలకు అందజేస్తారు. ఈ నియామక ప్రక్రియ పూర్తయ్యాక ఎంపికైన అభ్యర్థుల వేతనాలను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.




































