ఏపీ విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేటు విద్యా సంస్థలు విద్యార్ధుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. పరీక్ష ఫీజుల పేరుతోనూ దోపీడీకి దిగుతున్నాయి.
పదో తరగతి పరీక్షల ఫీజుల్లో ప్రైవేటు పాఠశాలల బాదుడు పైన ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీంతో, విద్యా శాఖ ఈ వ్యవహారం పైన సీరియస్ అయింది. కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అధిక ఫీజులు వసూలు చేస్తున్న సంస్థలకు హెచ్చరిక జారీ చేసారు.
ప్రైవేట్ పాఠశాలలు ఏదో ఒక కారణంతో విద్యార్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. పరీక్ష ఫీజులు కూడా వారి దోపిడీలో భాగమయ్యాయి. పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజుల్లోనూ భారీ గా వసూలు చేస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ప్రభుత్వ పరీక్షల విభాగం నిబంధనల ప్రకారం ఒక విద్యార్థి అన్ని సబ్జెక్టులకు కలిపి చెల్లించాల్సింది 125 రూపాయలైతే, అందుకు చాలా రెట్లు ఎక్కువగా విద్యార్థుల నుంచి ప్రైవేటు పాఠశాలలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఒక్కో విద్యార్థి నుంచి రూ.900 వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం పాఠశాల విద్యాశాఖ దృష్టికి వచ్చింది. కఠినంగా వ్యవహరించాలని అధికారులు నిర్ణయించారు. రూ. 125 కంటే అదనంగా ఎక్కడైనా వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ స్పష్టం చేసారు.
అందులో భాగంగా నిర్దేశిత రుసుము కంటే అదనంగా వసూలు చేసే ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకుని, జరిమానాలు కూడా విధించేందుకు సిద్దమయ్యారు. మరోవైపు ఎక్కడైనా ప్రభుత్వ పాఠశాలల్లో అదనంగా వసూలుచేస్తే ప్రధానోపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని డైరెక్టర్ హెచ్చరించారు. అదనపు వసూళ్లపై ఎంఈవోలు, డిప్యూటీ డీఈవో, డీఈవో, ఆర్జేడీలకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఫిర్యాదుల ఆధారంగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసారు. ఇప్పటివరకూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ద్వారా మాత్రమే పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఉంది. ఈ ఏడాది నుంచి నేరుగా విద్యార్థులే చెల్లించే అవకాశం కల్పించారు. విద్యార్థులు లేదా తల్లిదండ్రులు ‘బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్’ వెబ్సైట్ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.

































