విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్.. సూపర్ స్కీమ్ ప్రకటించిన సీఎం చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యా వ్యవస్థలో వినూత్న మార్పులు తీసుకొస్తామని, ఉన్నత విద్యకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా భామిని గ్రామంలోని ఏపీ మోడల్ హైస్కూల్‌లో జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థుల కోసం కీలక పథకాన్ని ప్రకటించారు. “ఉన్నత విద్యకు, విదేశీ విద్యకు ప్రభుత్వం సహకారం అందిస్తుంది. దీనికోసం కలలకు రెక్కలు పథకాన్ని ప్రారంభిస్తున్నాం. విదేశీ విద్య కోసం ఎంత ఖర్చు అవుతుందో ఆ మొత్తం పావలా వడ్డీకే రుణం ఇప్పిస్తాం’’ అని బాబు స్పష్టం చేశారు. విదేశీ విద్య కోసం విద్యార్థులు తమ కోరికలను చంపుకోవాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు.

విద్యా రంగంలో కీలక సంస్కరణలు

ముఖ్యమంత్రి పీటీఎం 3.0 వేదికగా రాష్ట్ర విద్యా రంగంలో తీసుకుంటున్న నిర్ణయాలను వివరించారు: విద్యార్థుల బలాబలాలను ఎప్పటికప్పుడు విశ్లేషించేందుకు ఉపయోగిస్తున్న క్లిక్కర్ టూల్ విధానం అద్భుతంగా పని చేస్తోందని సీఎం కితాబిచ్చారు. ఇది పిల్లల్లో ఆసక్తిని పెంచుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి టీచర్‌కు కేవలం 18 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని.. ప్రైవేట్ స్కూళ్లలో 25 మంది ఉన్నారని తెలిపారు. అంటే ప్రభుత్వ స్కూళ్లే మెరుగైన బోధన అందిస్తున్నాయని స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజనం, స్టూడెంట్ కిట్స్ నాణ్యతను పెంచామని, స్టూడెంట్ కిట్లపై పార్టీ రంగులు, చిహ్నాలు, ఫొటోలు లేకుండా అందిస్తున్నామని చెప్పారు.


విలువలతో కూడిన విద్య

విలువలతో కూడిన విద్యను అందించే ఉద్దేశంతో చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాల ద్వారా విద్యార్థులకు విలువలను నేర్పిస్తున్నామని సీఎం తెలిపారు. మెగా డీఎస్సీని సమర్థంగా నిర్వహించి, ఏడాదిలోనే ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశామని, టీచర్లను గౌరవించే బాధ్యత తమదని సీఎం అన్నారు. రాబోయే కాలంలో విద్యా వ్యవస్థలో ఎవ్వరూ ఊహించని ఫలితాలు వస్తాయి.. దీనికి అందరూ సహకరించాలి. మూడేళ్లలో దేశంలోనే నెంబర్ వన్ చేసేలా ఆంధ్రా స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తెస్తానని మంత్రి లోకేష్ చెప్పారు. పిల్లలను సానబెడితే అద్భుతాలు సాధిస్తారు. నేను అనుకున్నదానికంటే విద్యా విధానం మెరుగ్గా ఉంది. పిల్లలు కూడా వాటిని అందిపుచ్చుకుంటున్నారు’’ అని చంద్రబాబు అన్నారు.

స్టూడెంట్స్ ఇన్నోవేటర్స్ పార్టనర్‌షిప్..

విద్యార్థుల్లోని సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రణాళికను సీఎం ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరిలో స్టూడెంట్స్ ఇన్నోవేటర్స్ పార్టనర్‌షిప్ సమ్మిట్ నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపారు. 7వ తరగతి నుంచి విద్యార్థులు వినూత్నంగా ఆలోచించి, గ్రూప్‌గా లేదా వ్యక్తిగతంగా ఇన్నోవేషన్స్ చేసేలా ప్రోత్సహిస్తామని చెప్పారు. ప్రతిభావంతులకు రివార్డులు అందిస్తామని, ప్రముఖ పారిశ్రామికవేత్తలను ఈ సదస్సుకు ఆహ్వానిస్తామని తెలిపారు.

సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్‌ను ప్రత్యేకంగా అభినందించారు. తన తల్లి భువనేశ్వరి తనను స్టాన్‌ఫోర్డ్ స్థాయి వరకు తీసుకెళ్లారని.. ఇప్పుడు రాష్ట్ర విద్యార్థులందరినీ ఆ స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత లోకేష్‌దేనని సూచించారు. ఇక బప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన ముస్తాబు కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.