తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలకు టోకెన్ల కేటాయింపు.. టికెట్ లేకపోయినా దర్శనం

దేవదేవుడు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి రిజిస్ట్రేషన్లు పోటెత్తాయి..! రెండ్రోజుల్లోనే రికార్డు బ్రేకింగ్‌ రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.


తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు డిసెంబర్ 30 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి మూడు రోజులకు సంబంధించి ఆన్ లైన్ ద్వారా ఈ-డిప్ కోసం పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ఇప్పటి వరకు సుమారు 19.5 లక్షల మంది భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. టీటీడీ వెబ్‌ సైట్ ద్వారా 7.5 లక్షల మంది, టీటీడీ మొబైల్‌ యాప్‌ నుంచి 10.8 లక్షల మంది, ఏపీ గవర్నమెంట్‌ వాట్సాప్‌తో 1.2 లక్షల మంది భక్తులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.

వైకుంఠ ద్వారా దర్శనాలకు సంబంధించి మొదటి మూడు రోజులు.. అంటే డిసెంబర్ 30, 31, జనవరి 1న వైకుంఠ ద్వార దర్శనం కోసం 1,76,000 టోకెన్లు అందుబాటులో ఉంటాయి. ఈ డిప్‌ విధానం ద్వారా టోకెన్లు పొందిన భక్తులకు డిసెంబర్ 2న ఫోన్ ద్వారా మెసేజ్ వెళ్తుంది. తొలి మూడు రోజుల పాటు ఈ డిప్‌లో టికెట్లు పొందిన వారిని మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తారు. మిగిలిన ఏడు రోజులు టోకెన్లు లేని భక్తులకు దర్శన అవకాశం కల్పిస్తారు. ఈ డిప్‌లో టోకెన్లు పొందాలనుకునే భక్తులు డిసెంబర్ 1 వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు.

తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలకు ఈ-డిప్‌ ద్వారా TTD టోకెన్లు కేటాయించింది. వైకుంఠ ఏకాదశి తొలి 3 రోజుల దర్శన టోకెన్ల కోసం 25లక్షల 72వేల 111 మంది భక్తులు రిజిస్ట్రేషన్‌ చేసుకోగా.. ఈ-డిప్‌ ద్వారా ఒక లక్ష 76వేల టోకెన్లు జారీ చేసినట్టు TTD ప్రకటించింది. TTD వైకుంఠ ద్వార దర్శనాల ఈ-డిప్‌లో ఏపీ టాప్‌లో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భక్తులకు 58,923, తెలంగాణకు 41,965, తమిళనాడుకు 11,703, కర్ణాటకకు 20,929, మహారాష్ట్రకు 3,352, కేరళకు 287, పుదుచ్చేరి 181, ఒడిశా 180, గుజరాత్ 114, త్రిపుర 8, పాస్‌పోర్ట్ 91 మంది భక్తులకు టైమ్‌ స్లాటెడ్ టోకెన్లు జారీ చేసింది.

ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 30న 8లక్షల71వేల 340 మంది భక్తులు రిజిస్ట్రేషన్‌ చేసుకోగా.. ఈ-డిప్‌ ద్వారా 57వేల మందికి టోకెన్ల కేటాయించింది. డిసెంబర్ 31న దర్శనానికి 8లక్షల 52వేల 404 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకోగా.. 64వేల మందికి, జనవరి 1న దర్శనానికి 8లక్షల48వేల 367 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే.. 55వేల మందికి కేటాయించింది. మరోవైపు.. వైకుంఠ ద్వార దర్శనాల్లో తొలి మూడు రోజులు 300రూపాయల దర్శనం, శ్రీవాణి దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

ప్రొటోకాల్‌ ప్రముఖులకు మినహా అన్ని రకాల సిఫార్సు దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వైకుంఠ ఏకాదశి రోజున 70వేల మందికి దర్శన ఏర్పాట్లు చేస్తుండగా.. గంటకు 4వేల 300 మందికి దర్శనాలు కల్పించనుంది. ఇక.. ఈ-డిప్‌లో ఎంపికైన భక్తులకు ఫోన్‌ ద్వారా ఎస్‌ఎంఎస్‌ పంపనుండగా.. అందులోని లింక్‌ ఓపెన్‌ చేసుకుని ఉచిత టోకెన్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది.

ఇక పది రోజుల్లో 182 గంటల పాటు వైకుంఠద్వార దర్శన తలుపులు తెరిచే ఉంటాయి. అందులో 164 గంటలు సామాన్య భక్తులకే కేటాయిస్తామని ఇప్పటికే TTD తెలిపింది. మొత్తంగా.. ఆ 10 రోజుల పాటు 8 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.