ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. జనవరి నుంచి అన్ని సేవల్ని మనమిత్ర యాప్, వాట్సప్ ద్వారా అందిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువయ్యేలా ప్రజా పంపిణీ వ్యవస్థలో కొత్త ఒరవడిని తీసుకువస్తోంది.
ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డులు, ఈ-పోస్ యంత్రాలు అందుబాటులోకి రాగా.. ఇప్పుడు కొత్త ఏడాదిలో మరిన్ని సంస్కరణలు చేపడుతోంది.. వాట్సప్ సేవల్ని అందుబాటులోకి తెస్తోంది. ప్రజలు తమ సమస్యలను సులభంగా పరిష్కరించుకోవడానికి, 95523 00009 అనే నంబర్ను తమ ఫోన్లలో సేవ్ చేసుకుని, ‘హాయ్’ అని మెసేజ్ పంపితే చాలు. వెంటనే ప్రభుత్వంలోని వివిధ శాఖల వివరాలు కనిపిస్తాయి. అందులో పౌర సరఫరాలపై క్లిక్ చేస్తే, మీకు కావాల్సిన సేవలు అందుబాటులో ఉంటాయి. మీ సమస్యపై అక్కడే దరఖాస్తు చేసుకోవచ్చు.
కొత్త రేషన్ కార్డు కోసం ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మొబైల్ ఫోన్ నుంచే సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన అన్ని పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే, మీ దరఖాస్తు నేరుగా సచివాలయానికి చేరుతుంది. అక్కడి అధికారులు పరిశీలన చేసిన తర్వాత, మీ కొత్త రేషన్ కార్డు మీ ఇంటికే పోస్ట్ ద్వారా వస్తుంది. అంతేకాకుండా, ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులో కొత్త సభ్యులను చేర్చాలన్నా, మరణించిన వారి పేర్లను తొలగించాలన్నా, లేదా మీ చిరునామా మార్చుకోవాలన్నా, ఇలా ఏ సేవనైనా ఈ కొత్త విధానం ద్వారా పొందవచ్చు.
ప్రస్తుతం అన్ని రేషన్ దుకాణాల్లో స్మార్ట్ కార్డుల పంపిణీ జరుగుతోంది. అయితే, చాలా మంది వలసలు వెళ్లిపోవడం, తమ కార్డులు ఎక్కడ ఉన్నాయో తెలియకపోవడం వంటి కారణాలతో ఇంకా కార్డులు తీసుకోలేదు. ఒకవేళ మీ స్మార్ట్ కార్డు పోగొట్టుకున్నట్లయితే, చింతించాల్సిన అవసరం లేదు. కొత్త యాప్లో డూప్లికేట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పించారు. ఈ కొత్త విధానాలన్నీ ప్రజలకు మరింత సౌకర్యవంతంగా సేవలు అందించడానికే ప్రభుత్వం చేపట్టింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ షాపుల్లో కొత్త సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చింది. ప్రతి రేషన్ షాపులో ఇప్పుడు క్యూఆర్ కోడ్ ఉంటుంది. దీనివల్ల ప్రజలు రేషన్ షాపుల్లో జరిగే అక్రమాలు, అవకతవకలు, లోపాల గురించి నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఫోన్లో ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే, ఫిర్యాదులు, పౌరసరఫరాలపై అభిప్రాయాలు తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఈ ఫిర్యాదులను పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకుంటుంది. ధాన్యం కొనుగోలు ఎప్పుడు జరుగుతుందో తెలుసుకోవడానికి, దాని షెడ్యూల్ చేసుకోవడానికి ఒక సులభమైన మార్గం అందుబాటులోకి వచ్చింది. 73373 59375 అనే వాట్సప్ నంబర్కు ‘హాయ్’ అని మెసేజ్ పంపితే చాలు. దీని ద్వారా ధాన్యం కొనుగోలుకు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు.
ఇక పెళ్లి తర్వాత రేషన్ కార్డులో మార్పులు చేయడం చాలా సులభమైంది. గతంలో పెళ్లి అయిన తర్వాత పాత కార్డు నుంచి పేరు తొలగించి, కొత్త కార్డు పొందడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు, పెళ్లి ధ్రువపత్రం ఆన్లైన్లో అప్లోడ్ చేసి దరఖాస్తు చేస్తే సరిపోతుంది. దీని ద్వారా పాత కార్డు నుంచి పేరు తొలగించి, కొత్త కార్డు పొందవచ్చు. ప్రభుత్వం అన్ని సేవలను ఫోన్ ద్వారానే అందించేలా ఏర్పాట్లు చేసింది. దీనివల్ల ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. సిబ్బంది దగ్గర ప్రాధేయ పడాల్సిన పని కూడా లేదు. అందరూ “మనమిత్ర” వాట్సప్ నంబర్ను సేవ్ చేసుకుని, ఈ సేవలను ఉపయోగించుకోవాలని కోరుతున్నారు.


































