ఏపీలో వారందరికి షాక్.. పింఛన్‌లు రద్దు, ఫుల్ క్లారిటీ వచ్చేసిందిగా

ర్హులైన ఏ ఒక్కరి పింఛనూ తొలగించలేదన్నారన్నారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మండిపడ్డారు. కేవలం సదరం ధ్రువీకరణ పత్రాల పరిశీలన మాత్రమే ప్రభుత్వం చేపడుతోందన్నారు..


ఇది అర్హతను నిర్ధారించుకోవడానికి మాత్రమేనన్నారు. పింఛన్ల తొలగింపుపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో అర్హులైన వారికి పింఛన్లు అందలేదని, అనర్హులకు తప్పుడు పత్రాలతో పింఛన్లు మంజూరు చేశారని మంత్రి ఆరోపించారు. దీనివల్ల ప్రజాధనం వృధా అయిందని ఆయన అన్నారు. ఈ పరిశీలన ప్రక్రియ ద్వారా అర్హులైన వారందరికీ పింఛన్లు అందేలా ప్రభుత్వం చూస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

దివ్యాంగుల పింఛన్లపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి. పింఛన్ల పెంపు విషయంలో జగన్ మాట తప్పి దివ్యాంగులను మోసం చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం 5 లక్షల పింఛన్లు తొలగించిందని జగన్ అండ్ కో విష ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అర్హులైన ఏ ఒక్కరి పింఛనూ తొలగించలేదని.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛను అందిస్తున్నామన్నారు.

దివ్యాంగుల పింఛను రూ.3వేల నుంచి రూ.6వేలకు పెంచిన ఘనత సీఎం చంద్రబాబుదేనని మంత్రి ప్రశంసించారు. గత ఐదేళ్లలో పింఛన్ల కోసం జగన్ ప్రభుత్వం రూ.84 వేల కోట్లు ఖర్చు చేస్తే.. కూటమి ప్రభుత్వం కేవలం 18 నెలల్లోనే రూ.50 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. సీఎం చంద్రబాబు దివ్యాంగులకు 7 వరాలు ప్రకటించారని.. రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులు చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారన్నారు. అది చూసి ఓర్వలేకనే జగన్ అండ్ కో దివ్యాంగుల పింఛన్లపై విష ప్రచారం చేస్తున్నారన్నారు. పింఛన్ల తొలగిస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు.

ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ

మరోవైపు ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద జనవరి నెలకు సంబంధించిన పింఛన్‌ను డిసెంబర్ 31వ తేదీనే లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక రోజు ముందుగానే పింఛను ఇవ్వడం ద్వారా ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పింఛన్ల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లను చేసుకోవాలని జిల్లా డీఆర్‌డీఏ పీడీలను ఆదేశించింది. జనవరి 1వ తేదీన న్యూ ఇయర్ కావడలంతో ప్రజలకు ఒక రోజు ముందుగానే పింఛన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. . ఈ పింఛన్ల కోసం అవసరమైన నగదును డిసెంబర్ 30వ తేదీనే బ్యాంకుల నుంచి తీసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సూచించారు. ఈ పనిని సకాలంలో పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పింఛన్‌లు తీసుకునేవారు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.