తిరుపతి జిల్లా శెట్టిపల్లెలో దశాబ్దాలుగా పరిష్కారం కాని భూ సమస్యకు పరిష్కారం లభించింది. పేద కుటుంబాలకు న్యాయం చేయనున్నట్లు రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
శెట్టిపల్లెలో దశాబ్దాలుగా ఉన్న అన్సెటిల్డ్ ఎస్టేట్ భూ సమస్యను పరిష్కరించడం ద్వారా 2,111 పేద కుటుంబాలకు న్యాయం చేయనున్నామన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ కుటుంబాలకు పట్టాలు అందజేస్తామని మంత్రి ప్రకటించారు. భూముల అక్రమాల్లో భాగస్వాములైన వైఎస్సార్సీపీ నేతలందరూ ఈ ఏడాది జైలుకు వెళ్లడం ఖాయమని.. అందుకే ఈ ఏడాదిని “భూనామ సంవత్సరం”గా ఆయన అభివర్ణించారు. ఈ భూ సమస్య వల్ల ఎంతోమంది పేద కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. వారికి న్యాయం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందన్నారు. ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి, అక్రమాలను అరికట్టడానికి కట్టుబడి ఉందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం న్యూ ఇయర్ వేళ నిషేధిత 22ఏ జాబితా నుంచి 5 రకాల భూములకు విముక్తి కల్పించింది. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ మేరకు న్యూ ఇయర్ రోజు ఫైల్పై సంతకం చేశారు. భూములను 8 రకాల పత్రాల్లో ఏదో ఒకటి ఉన్నా జాబితా నుంచి తొలగించాలని చెప్పారు. అలాగే భూ యజమానులను అనవసరంగా తిప్పించుకోవద్దు అన్నారు. ఈ నిర్ణయం వల్ల అనేక మంది భూ యజమానులకు ఊరట లభించనుంది. నిషేధిత జాబితాలో ప్రైవేటు భూములేవీ ఉండటానికి వీల్లేదన్నారు మంత్రి. త్వరలో జరిగే కేబినెట్ సబ్ కమిటీలో చుక్కల భూములు, రీసర్వే తర్వాత నిషేధ జాబితాలో చేర్చిన సర్వీసు ఈనాం వంటి మరో 4 రకాల భూములపై చర్చించి.. వాటిని కూడా తొలగిస్తామన్నారు. అలాగే ఫ్రీ హోల్డ్ భూములపై ఫిబ్రవరిలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కలెక్టర్లకు తప్పుడు రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారాన్ని అప్పగిస్తున్నామని.. అలాగే వాటికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకునే అధికారం కూడా కలెక్టర్లకే ఇస్తున్నామన్నారు. నేటి నుంచి పట్టాదారు పాస్పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని.. చిన్న తప్పులు ఉంటే సరిచేసి ఇంటి దగ్గరికే అందజేస్తామని చెప్పారు. డబుల్ రిజిస్ట్రేషన్లు చేసిన వారిని శిక్షించేలా చట్టాలు చేస్తున్నామని, రెవెన్యూ క్లినిక్లతో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు.
స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ బాధితులు, మాజీ, ప్రస్తుత సైనికోద్యోగులకు చెందిన భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి, 1954 జూన్ 18కి ముందు కేటాయించిన భూములకు, ప్రైవేటు పట్టాదారులకు చెందిన భూములకు, ఒకే సర్వే నంబరులో ప్రభుత్వ భూమితో పాటు ప్రైవేటు భూమి ఉంటే, ఆ ప్రైవేటు భూమికి సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తారు. దీనివల్ల ప్రైవేటు భూమి యజమానులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
ఈ ప్రక్రియలో అనేక రకాల రెవెన్యూ రికార్డులను ఉపయోగిస్తారు. ఉదాహరణకు, భూకేటాయింపుల కోసం జిల్లా సైనిక సంక్షేమ అధికారి చేసిన సిఫార్సుల రిజిస్టర్ (10(1) రిజిస్టర్) చాలా ముఖ్యం. అలాగే, అడంగల్, ఎస్ఎఫ్ఏ, ఎసైన్మెంట్ రిజిస్టర్, డీఆర్ దస్త్రాలు, రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్ (ఆర్ఓహెచ్), రిజిస్ట్రేషన్ పత్రాలు వంటివి కూడా పరిశీలిస్తారు. ఈ పత్రాలన్నీ భూమికి సంబంధించిన పూర్తి వివరాలను అందిస్తాయి. ఈ పత్రాలన్నీ భూమికి సంబంధించిన పూర్తి వివరాలను అందిస్తాయి. వీటిని జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా భూముల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించవచ్చు. ఈ ప్రక్రియ ద్వారా అర్హులైన వారందరికీ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నారు.



































