తిరుమలలో ఈనెల 25వ తేదీన రథసప్తమి జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై టీటీడీ కసరత్తు చేస్తోంది. ఇవాళ టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి గురువారం తిరుమలలోని పద్మావతి విశ్రాంతి గృహంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రథ సప్తమి రోజున భద్రత, భక్తుల రద్దీ నిర్వహణ, తదితర అంశాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. వైకుంఠ ద్వార దర్శనాలను అన్ని విభాగాల సమన్వయంతో విజయవంతం చేశారని ప్రకటించారు. అధికారులందరూ అదే స్ఫూర్తితో రథ సప్తమి పర్వదినాన్ని అద్భుతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అన్నారు. టీటీడీ అధికారులు, విజిలెన్స్ సెక్యూరిటీ, పోలీసులతో సమన్వయం చేసుకుని ముందస్తుగా భక్తుల రద్దీని అంచనా వేసుకుని అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని అదనపు ఈవో సూచించారు. ట్రాఫిక్, పార్కింగ్ , అత్యవసర టీమ్స్ లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.
సమగ్ర బందోబస్తు పై ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని, ఘాట్ రోడ్డు వాహనాల కదలికను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అదనపు ఈవో దిశానిర్దేశం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వాహనాలను తరలించేలించేందుకు వీలుగా కార్యాచరణ రూపొందించాలని కోరారు. ప్రతి ఒక్కరూ సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేసేలా సమన్వయం చేసుకోవాలని ఆయన ఆదేశించారు.
ఇంజినీరింగ్, అన్నప్రసాదం, పారిశుద్ధ్యం, శ్రీవారి సేవకులు, వైద్య బృందాలు, ఎల్ ఈ డీ స్క్రీన్లు, పుష్పాలంకరణ, సాంస్కృతిక కళా బృందాలు, ఎస్వీబీసీ మరియు సోషియల్ మీడియాలో ప్రచారం ఇతర ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సమావేశంలో టీటీడీ ఉన్నతాధికారులు, విజిలెన్స్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
రథసప్తమి వేడుకలు – వాహనసేవల వివరాలు :
- తెల్లవారుజామున ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు (సూర్యోదయం ఉదయం 6.45 గంటలకు) – సూర్యప్రభ వాహనం.
- ఉదయం 9 నుంచి 10 గంటల వరకు – చిన్నశేష వాహనం.
- ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు – గరుడ వాహనం.
- మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు – హనుమంత వాహనం.
- మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు – చక్రస్నానం.
- సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు – కల్పవృక్ష వాహనం.
- సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహనం.
- రాత్రి 8 నుంచి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనం.
ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు :
రథసప్తమి వేడుకల సందర్భంగా కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దవుతాయి. ఎన్.ఆర్.ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలు కూడా రద్దవుతాయని టీటీడీ తెలిపింది.
తిరుపతిలో జనవరి 24 నుండి 26వ తేది వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ రద్దవుతాయి. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు కావటంతో పాటు…. బ్రేక్ దర్శనాలకు సంబంధించి జనవరి 24న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.




































