భారతదేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే అది రైల్వే అని చెప్పక తప్పదు. ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద రవాణా వ్యవస్థలో భారత రైల్వే నాలుగో స్థానంలో ఉంది. ప్రస్తుతం హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు విజయవంతంగా నడుస్తుండగా, ఇప్పుడు వందే భారత్ స్పీపర్ రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. మరి వందేభారత్ రైళ్లు ఎక్కడ తయారు అవుతాయి..? వాటి వివరాలు ఏంటో తెలుసుకుందాం..
చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) వందే భారత్ రైళ్లను తయారు చేస్తుంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద రైల్వే కోచ్ ఫ్యాక్టరీ. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) చెన్నైలోని లక్ష్మీపురంలో ఉంది. ICFలో 18,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇక్కడే వందే భారత్ రైళ్లు తయారు అవుతాయి.
ఐసిఎఫ్ ఏటా 1,500 కోచ్లను తయారు అవుతున్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఐసిఎఫ్ 2018లో వందే భారత్ రైళ్ల తయారీని ప్రారంభించింది. ఇప్పటి వరకు ఐసీఎఫ్ 100కుపైగా వందేభారత్ రైళ్లను తయారు చేసింది. వందే భారత్ రైళ్లు భారతదేశంలోనే అత్యంత వేగవంతమైన, అత్యంత ఆధునిక రైళ్లు. ఇవి గంటకు 180 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు.
వందే భారత్ రైళ్లలో ఎయిర్ కండిషనింగ్, వై-ఫై, పవర్ సాకెట్లు వంటి అనేక ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. వందే భారత్ ఎక్స్ప్రెస్లు స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన భారతదేశపు సెమీ-హై స్పీడ్ రైళ్లు.
వందే భారత్ రైళ్లను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవతో సుమారు 90% స్థానిక పరిజ్ఞానంతో తయారు చేస్తారు. స్టెయిన్లెస్ స్టీల్ బాడీ, అధునాతన మోటార్ కోచ్లు, ఏరోడైనమిక్ డిజైన్, ఆటోమేటిక్ డోర్స్తో రూపొందించారు. ప్రయాణీకుల కోసం వైఫై, సిసిటివి, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కవచ్ భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేస్తారు. ఇతర రైళ్ల కంటే ఈ రైళ్లలో ఎంతో టెక్నాలజీ ఉంటుంది.

































