రాష్ట్రంలో చేపట్టిన జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి ప్రాజెక్టులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో రూ.1.40 లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయని, ఇవన్నీ 2029 నాటికి పూర్తయ్యేలా స్పష్టమైన కార్యాచరణ ఉండాలని తెలిపారు. కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ, జాతీయ రహదారుల సంస్థ ద్వారా చేపడుతున్న పనుల్లో ఆలస్యం లేకుండా వేగం పెంచాలని సూచించారు. గురువారం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో రహదారుల విస్తరణ, కొత్త రోడ్ల నిర్మాణం, జరుగుతున్న ప్రాజెక్టుల పురోగతిపై సీఎం విస్తృతంగా చర్చించారు.
రాష్ట్రంలో రహదారి నెట్వర్క్ మరింత బలంగా ఉండాలని, రోడ్ డెన్సిటీ పెరగడం ద్వారా పరిశ్రమలు, వ్యవసాయం, వాణిజ్యానికి ఉపయోగం ఉంటుందని సీఎం అన్నారు. సరుకు రవాణా ఖర్చు తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా రహదారి ప్రాజెక్టులు రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. శ్రీకాకుళం జిల్లా మూలపేట, విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం వంటి ప్రధాన పోర్టులను జాతీయ రహదారులతో అనుసంధానించాలని సూచించారు. ఈ పోర్టులకు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా సరుకు రవాణా జరిగేలా హింటర్ల్యాండ్ రోడ్లను అభివృద్ధి చేయాలని తెలిపారు.
ప్రస్తుతం రెండు లేన్లుగా ఉన్న జాతీయ రహదారులను అవసరాన్ని బట్టి నాలుగు, ఆరు లేన్లుగా విస్తరించాలన్నారు. ప్రస్తుతం రూ.42,194 కోట్ల విలువైన జాతీయ రహదారుల పనులు కొనసాగుతున్నాయని, అవి వచ్చే ఏడాది డిసెంబరు నాటికి పూర్తి కావాలని ఆదేశించారు. అమరావతిని అనుసంధానించే బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనులు 2027 నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఖరగ్పూర్-అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేకు త్వరగా డీపీఆర్లు సిద్ధం చేయాలని సూచించారు.
రహదారుల ప్రణాళికలు రూపొందించాలి:
రాష్ట్రంలో ప్రాధాన్యత ఉన్న రోడ్డు ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులు త్వరగా తీసుకుని పనులు ప్రారంభించాలని సీఎం చంద్రబాబు చెప్పారు. కేంద్రానికి పంపాల్సిన ప్రతిపాదనలను ఆలస్యం చేయకుండా సమర్పించాలని ఆదేశించారు. నాగ్పూర్ నుంచి విజయవాడ మీదుగా మచిలీపట్నం, అలాగే రాయపూర్-అమరావతి-మూలపేట పోర్టు మార్గాలను అనుసంధానించేలా రహదారుల ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
రూ.2,500 కోట్లతో 6,054 కి.మీ.:
రూ.2,500 కోట్లతో 6,054 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశామని అధికారులు వివరించారు. ఆధునిక సాంకేతికతతో రోడ్ల నాణ్యత పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. డేనిష్ ఫైబర్, వేస్ట్ ప్లాస్టిక్ బిటుమిన్, తిరుపతి ఐఐటీ అభివృద్ధి చేసిన నానో కాంక్రీట్ వంటి కొత్త పద్ధతులతో ప్రయోగాత్మకంగా రోడ్లు వేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని 45 వేల కిలోమీటర్ల రహదారుల్లో గుంతలు లేకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. రోడ్ల నిర్వహణకు తగిన నిధులు సమకూర్చాలని, రామ్స్ టెక్నాలజీ ద్వారా రోడ్ల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. పీపీపీ విధానంలో 709 కిలోమీటర్ల మేర 12 రహదారుల అభివృద్ధికి కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో బలమైన రహదారి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సీఎం స్పష్టం చేశారు.


































