ఏపీ ప్రభుత్వం రైతులకు బిగ్ అప్డేట్ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం రైతుల కోసం వరుసగా నిర్ణయాలు అమలు చేస్తోంది. ధాన్యం సేకరణ నిధులను 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు వెల్లడించింది. ఇక, ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులను పీఎం కిసాన్ తో కలిపి జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పీఎం కిసాన్ నిధులు వచ్చే వారం జమ అయ్యే ఛాన్స్ ఉంది. కాగా.. తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శనగల సేకరణ… ధరల పైన రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు.
ఏపీ ప్రభుత్వం రైతుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల నుంచి శనగల సేకరణ చేసేందుకు సిద్దమైంది. నెల నుంచి శనగల కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. అంతేకాదు శనగలు కొనుగోలు చేసిన అనంతరం 15 రోజుల్లోనే నగుదును రైతుల బ్యాంక్ అకౌంట్లలో నేరుగా జమ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. నగదు చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు తెలిపారు. ఈ రోజు నుంచి రాష్ట్రంలో రైతుల నుంచి శనగల కొనుగోళ్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
రబీ సీజన్ 2025-26లో పండించిన శనగలను కొనుగోలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. శనగలను కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని, దీని ప్రకారం ఫిబ్రవరి 18 నుంచి సీఎం యాప్ ద్వారా అన్ని జిల్లాల్లో కొనుగోళ్లు చేపడతామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు ప్రకారం రైతుల నుంచి కొనుగోలు చేయనున్నట్లు అచ్చెన్నాయుడు తాజా ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రభుత్వం అధికారులకు మార్గదర్శకాలు
కాగా, రాష్ట్రంలో రబీ సీజన్ లో 3.25 లక్షల హెక్టార్లలో శనగల సాగు జరిగినట్లు అధికారిక లెక్కలు వెల్లడించాయి. ఇందులో భాగంగా దాదాపు 3.77 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరిగినట్లు ప్రభుత్వం అంచనా. అయితే, ముందుగా రైతులు స్థానిక రైతు భరోసా కేంద్రాల్ తమ పంటను నమోదు చేయించుకోవాలి. సీఎం యాప్ ద్వారా వీటి కొనుగోళ్లు చేపట్టేలా మార్గదర్శకాలు జారీ అయ్యాయి. కొనుగోలు చేసిన శనగలను గోదాముల్లో నిల్వ చేసి.. ఆ తరువాత 15 రోజుల్లోనే సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
రైతు సేవా కేంద్రాల్లో వీటి కొనుగోళ్లు జరుగుతాయని అచ్చెన్నాయుడు వెల్లడించారు. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కొనుగోళ్ల పర్యవేక్షణ ఉంటుంది. ఇప్పటికే కొనుగోళ్లకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ఖరారు చేసింది. వ్యవసాయం, మార్కెటింగ్, ఏపీ మార్క్ఫెడ్, సివిల్, లీగల్ మెట్రాలజీ, పౌర సరఫరాల శాఖల ల సమన్వయంతో రైతు సేవా కేంద్రాల్లో శనగల కొనుగోళ్లు చేపట్టేలా జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.




































