Cow: తన బిడ్డను చంపిందని.. పులిని ఫారెస్ట్‌ అధికారులకు పట్టించిన ఆవు..

చిన్నప్పుడు ఆవు-పులి కథ గురించి మనం పుస్తకాల్లో చదువుకున్నాం. తన బిడ్డ కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడిన ఆవు కథ అది. సరిగ్గా అటువంటిదే, అంతకంటే ఎమోషనల్ ఘటన ఒకటి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఇటిక్యాలపహాడ్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికులను కంటనీరు పెట్టించింది. ఆదివారం ఎప్పటిలాగే ఆవుల మందతో కలిసి ఓ ఆవు తన లేగదూడను వెంటబెట్టుకుని అడవిలోకి మేతకు వెళ్లింది. అక్కడ అప్పటికే పొంచి ఉన్న పులి ఒక్కసారిగా ఆవుల మందపై దాడి చేసి, తల్లి ఆవు కళ్లముందే లేగదూడను హతమార్చింది. ప్రాణభయంతో మంద మొత్తం చెల్లాచెదురైనా, ఆ తల్లి మనసు మాత్రం బిడ్డను వదిలి రాలేకపోయింది. చివరికి సాయంత్రం భారమైన మనసుతో కన్నీరు పెట్టుకుంటూ ఇంటిబాట పట్టింది తల్లిఆవు. సాయంత్రం ఆవు ఒక్కటే ఇంటికి రావడంతో యజమాని కంగారు పడ్డాడు. ఏమై ఉంటుందా ఆవు దగ్గరకు వెళ్లాడు యజమాని. ఆవు అడవి వైపు చూస్తూ అరుస్తుండటంతో, ఏదో జరిగిందని గ్రహించాడు.యజమాని తనదగ్గరకు రాగానే ఆవు నేరుగా అడవిలోకి దారితీసింది. ఆవు వెంటే వెళ్లిన యజమాని అక్కడ పులికి బలైపోయిన లేగదూడను చూసాడు. ఆవుదూడను పులి తినేసిందని గ్రహించిన అతను, ఇంటికి తిరిగి వచ్చి అటవీ అధికారులకు సమాచారం అందించాడు. ఎవరైనా తన బిడ్డను బ్రతికిస్తారన్న ఆశో.. లేక తన బిడ్డలా ఇతర దూడలు బలైపోకూడదనే తపనో కానీ…అటవీ అధికారులు రాగానే ఆవు వారితో కూడా కలిసి అడవిలోకి వెళ్లింది. పులికి బలైపోయి పొదల్లో ఉన్న తన బిడ్డ కళేబరాన్ని చూపించి మూగగా రోధించింది. అక్కడ ఉన్న పులి పాదముద్రలను బట్టి అది పులి దాడి అని అధికారులు నిర్ధారించారు. మూగజీవమైనా తన బిడ్డపై ఉన్న మమకారంతో అటవీ అధికారులకు దారి చూపిన తీరు చూసి అందరూ నివ్వెరపోయారు. “తల్లి ప్రేమకు భాష అవసరం లేదు, అది కేవలం అనురాగంతోనే ముడిపడి ఉంటుంది” అని ఈ గోమాత మరోసారి నిరూపించింది.


 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.