Andhra Pradesh Govt New Family Card: ఏపీ ప్రభుత్వం ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ను అమలు చేయాలని ప్లాన్ చేసింది. సంక్షేమ పథకాలు, పౌర సేవల్ని ప్రతీ కుటుంబం ఒక యూనిట్గా తీసుకుని.. ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి పర్యవేక్షించనుంది. దీని కోసం ఫ్యామిలి కార్డుల్ని జారీ చేయనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో అధికారులు కసరత్తు చేస్తున్నారు. కలెక్టర్ల సదస్సులో ఈ ఫ్యామిలీ కార్డుపై చర్చ జరిగింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే రోజుల్లో పౌర సేవల్ని త్వరగా అందించేందుకు, సంక్షేమ పథకాల అమలుకు ఫ్యామిలీ కార్డు (ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్) విధానం అమలు చేయనున్నారు. అమరావతిలో నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సులో త్వరలోనే ఫ్యామిలీ కార్డు (స్మార్ట్ కార్డ్) విధానం తీసుకొస్తున్నామన్నారు ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్కుమార్. ఈ కార్డుతో సంక్షేమ పథకాలను అనుసంధానం చేస్తారని.. ఈ మేరకు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ కార్డుతో సూపర్ సిక్స్ పథకాలను కనెక్ట్ చేస్తామంటున్నారు. అలాగే రాష్ట్రంలో 20 లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్శకులకు అనుసంధానం చేశామన్నారు పీయూష్ కుమార్.
ఏపీ ప్రభుత్వం ప్రతి కుటుంబం ఒక యూనిట్గా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎఫ్బీఎంఎస్)ను తీసుకొస్తోంది.. ఫ్యామిలీ స్మార్ట్ కార్డును జారీ చేయాలని నిర్ణయించింది. ఈ కార్డులో 26 అంశాలతో (ఫ్యామిలీ ఐడీ, ఆధార్ నెంబర్, రైస్ కార్డ్ ఐడీ, విద్యార్హతలు, వృత్తి, మొబైల్ నంబర్, చిరునామా, వ్యవసాయ భూమి, అర్బన్-రూరల్ ప్రాపర్టీ వంటి వివరాలు) డేటాబేస్ రూపొందించనున్నారు. ఇప్పటికే 82 శాతం సమాచారం ఉండగా.. ఏప్రిల్ 30 నాటికి 90 శాతం డేటా బేస్ సిద్ధం చేస్తామంటున్నారు. రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికి ఫ్యామిలీ కార్డు అందించేలా ప్లాన్ చేశారు అధికారులు. ఈ ఫ్యామిలీ కార్డును క్యూఆర్ కోడ్తో రూపొందించనున్నారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన ఆ కుటుంబానికి సంబంధించిన సమాచారం తెలుస్తుంది.. కుటుంబానికి సంబంధించిన పత్రాలను తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు అంటున్నారు.
ఏపీ ప్రభుత్వం ప్రజలకు సుపరిపాలనలో భాగంగా ఈ ఫ్యామిలీ కార్డు ద్వారా అర్హులైన వారందరికీ పథకాలు అందించేందుకు, పౌర సేవలు కూడా సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొన్ని పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో ఎదురవుతున్న ఇబ్బందులు కూడా ఈ విధానం ద్వారా పరిష్కారం అవుతాయి అంటున్నారు. అంతేకాదు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ ద్వారా కుటుంబ వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేలా ప్లాన్ చేస్తారు. ఈ ఒక్క కార్డు ద్వారానే అన్ని వివరాలూ తెలిసేలా ప్రభుత్వం రూపొందించింది.

































