Rashmika: ‘8 ఏళ్లుగా వేధిస్తున్నారు.. ఇకపై ఊరుకోను, 24 గంటల్లోగా ఆ కథనాలు తొలగించండి’.. రష్మిక వార్నింగ్

విజయ్ దేవరకొండతో వివాహం తర్వాత తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న వ్యక్తిగత దాడులపై రష్మిక మందన్న ఆగ్రహం వ్యక్తం చేసింది. గత ఎనిమిదేళ్లుగా ఒక వర్గం తన మాటలను వక్రీకరిస్తూ, తప్పుడు ప్రచారం చేస్తూ వేధిస్తోందని ఆమె వాపోయింది. తన ప్రైవసీకి భంగం కలిగిస్తూ, ఏళ్ల క్రితం నాటి వ్యక్తిగత సంభాషణలను ఇప్పుడు కావాలనే బయటపెట్టి వివాదాలు సృష్టిస్తున్నారని మండిపడింది. తన కుటుంబాన్ని కూడా ఇందులోకి లాగారని, ఈ కంటెంట్‌ను 24 గంటల్లోగా తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని రష్మిక హెచ్చరించింది. తన జీవితంపై నిర్ణయం తీసుకునే హక్కు ఎవరికీ లేదని ఆమె స్పష్టం చేసింది.
సౌత్ స్టార్ హీరోయిన్ రష్మిక ఇటీవలే వివాహ బంధంలో అడుగుపెట్టింది. గత కొన్నేళ్లుగా ప్రేమిస్తున్న హీరో విజయ్ దేవరకొండని పెళ్లి చేసుకుంది. గత కొన్ని రోజులుగా తమ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తున్న రష్మిక.. ఇప్పుడు సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. తనను వ్యక్తిగతంగా అటాక్ చేస్తున్నారని, గత 8 ఏళ్లుగా వేధిస్తున్నారని వాపోయింది. ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్నానని, ఇకపై ఊరుకోనంటూ వార్నింగ్ ఇచ్చింది. ముఖ్యంగా కన్నడ మీడియా, ఇన్‌ప్లూయెన్సర్లపై మండిపడుతూ, ఈ మేరకు రష్మిక ఎక్స్ లో పోస్ట్ పెట్టింది.


“గత ఎనిమిదేళ్లుగా ఓ వర్గం మీడియా, కొందరు వ్యక్తులు నాపై తప్పుడు ప్రచారం చేస్తూ వేధిస్తున్నారు. నన్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తూనే ఉన్నారు. కేవలం వ్యూస్ కోసం నేను అనని మాటలను అన్నట్టుగా సృష్టించడం, నా మాటలను తప్పుగా ప్రచారం చేస్తూ నాపై ద్వేషాన్ని పెంచడాన్ని నేను గమనిస్తూనే ఉన్నాను. ఇవన్నీ నన్ను ఎంతో బాధపెట్టినా, ఇన్నాళ్లూ నేను ఓపికతో మౌనంగా ఉన్నాను. సెలబ్రిటీగా ఉన్నప్పుడు ఇలాంటి విమర్శలు వస్తాయని, మన పని మనం చేసుకుంటూ వెళ్తే అన్నీ సర్దుకుంటాయని అనుకున్నాను. కానీ గడిచిన 24 గంటల్లో జరిగినవి అన్ని హద్దులు దాటేశాయి”

”దాదాపు ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఒక వ్యక్తిగత సంభాషణను, ఎవరికీ తెలియకుండా రికార్డ్ చేసి ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న పరిణామాల సమయంలోనే, కావాలనే ఉద్దేశపూర్వకంగా తప్పుగా ప్రచారం చేస్తూ వివాదాన్ని సృష్టించారు. కేవలం నన్నే కాకుండా, నా కుటుంబాన్ని కూడా ఇందులోకి లాగి ఇబ్బంది పెడుతున్నారు. నా ప్రైవసీకి భంగం కలిగించడమే కాకుండా, పరువు నష్టం కలిగిస్తున్నారు”

”ఎనిమిదేళ్లుగా నాపై దాడులు జరుగుతున్నా భరించాను. కానీ ఇప్పుడు ఇతరులను కూడా ఇందులోకి లాగుతుంటే నేను మౌనంగా ఉండలేను. అందుకే ఇప్పుడు ఒక సరిహద్దు గీస్తున్నాను. నా గురించి ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు వెంటనే ఆ కంటెంట్‌ను తొలగించాలని కోరుతున్నాను. ఈ ప్రకటన చేసిన 24 గంటల్లోగా స్పందించకపోతే, రేపటి నుంచి చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాను”

”ఇప్పటి వరకు నాకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు. నా వ్యక్తిగత జీవితం గురించి తప్పుగా మాట్లాడేవారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. నా జీవితం ఎలా ఉండాలో నిర్ణయించే హక్కు ఎవరికీ లేదు. నా నిర్ణయాలు నేనే తీసుకుంటాను” అని రష్మిక తన పోస్టులో పేర్కొన్నారు. ఇంగ్లీష్ తో పాటుగా కన్నడలోనూ ఆమె ఈ ప్రకటన చేశారు.

రష్మిక గతంలో కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్‌మెంట్‌ రద్దు చేసుకుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండని పెళ్లి చేసుకోవడంతో సోషల్ మీడియాలో ఓ వర్గం నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. పాత వీడియోలు వైరల్ చేస్తున్నారు. ఈ నేపథ్యలోనే రష్మిక ఇలా ఘాటుగా రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది.