Odisha CM: సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగిన సామాన్యుడు.. మోహన్ మాఝీ ప్రయాణం సాగిందిలా..!

24 ఏళ్ల తర్వాత ఒడిశాలో అధికారాన్ని మార్చి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు. ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాంఝీని ఎంపిక చేసింది బీజేపీ. ఉత్తరప్రదేశ్ – మధ్యప్రదేశ్‌ – ఛత్తీస్‌గఢ్‌ తరహాలో ఒడిశాలో కూడా ఒక సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములాను బీజేపీ అమలు చేసింది. ఒడిశాకు ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటారు. వారిలో ఒకరు మహిళ. రాష్ట్రానికి డిప్యూటీ సీఎంలుగా పార్వతి ఫరీదా, కేవీ సింగ్ డియో బాధ్యతలు చేపట్టనున్నారు. ఒడిశా రాజకీయాల్లో మోహన్ మాఝీ తొలిసారిగా పెద్ద వేదికపైకి వచ్చారు. మోహన్ చరణ్ మాఝీ ఎవరో తెలుసుకుందాం..


2024 ఒడిశా అసెంబ్లీ ఎన్నికలలో ఎస్టీ రిజర్వ్డ్ స్థానమైన కియోంఝర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బిజూ జనతాదళ్ (BJD)కి చెందిన మీనా మాఝీని 11,577 ఓట్ల తేడాతో ఓడించి బీజేపీ అభ్యర్థి మోహన్ చరణ్ మాఝీ గెలుచుకున్నారు. 52 ఏళ్ల మోహన్ చరణ్ మాఝీ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. అతను 2000 నుంచి 2009 మధ్య రెండుసార్లు కియోంజర్‌కు ప్రాతినిధ్యం వహించారు. దీని తరువాత, మోహన్ చరణ్ మాంఝీ 2019 సంవత్సరంలో బీజేపీ టిక్కెట్‌పై కియోంజర్ నుండి ఎన్నికలలో పోటీ చేసి విజయం సాధించారు.

మోహన్ చరణ్ మాఝీ రాజకీయ ప్రయాణం ఎలా సాగింది..?

మోహన్ చరణ్ మాఝీ 6 జనవరి 1972న ఒడిశాలోని కియోంజర్‌లో జన్మించారు. అతను షెడ్యూల్డ్ తెగకు చెందినవారు. డాక్టర్ ప్రియాంక మరాండీని వివాహం చేసుకున్నారు. 1997-2000 మధ్యకాలంలో గ్రామ సర్పంచ్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా కార్యదర్శిగా పని చేశారు. 2005 నుంచి 2009 వరకు రాష్ట్ర ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా, ప్రభుత్వ డిప్యూటీ చీఫ్‌ విప్‌గా కూడా పనిచేశారు.

ఒడిశా 15వ ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ బాధ్యతలు

మోహన్ చరణ్ మాఝీ ఒడిశాకు 15వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 2024లో జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పట్నాయక్ ముఖ్యమంత్రి పదవిని పోగొట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 147 స్థానాలకు గాను 78 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. అదే సమయంలో బీజేడీకి 51, కాంగ్రెస్‌కు 14, ఇతరులకు 4 సీట్లు వచ్చాయి.