ఆహా.. ఏం ఐడియా గురూ.. కారు అద్దెకు తీసుకుని.. నెంబర్‌ ప్లేట్‌ మార్చి..

దర్జాగా షికారు.. గుర్తించి వెంబడించిన యజమాని
– తప్పించుకునే ప్రయత్నంలో వాహనాలను ఢీ


పంజాగుట్ట(హైదరాబాద్),: జూమ్‌ కార్‌ యాప్‌లో కారు బుక్‌ చేసుకున్నాడు.
కారును యజమానికి తిరిగి ఇవ్వకుండా నెంబర్‌ ప్లేటు మార్చి దర్జాగా తిరుగుతున్నాడు. శుక్రవారం రాత్రి అమీర్‌పేట-పంజాగుట్ట(Ameerpet-Panjagutta) మార్గంలో వెళుతుండగా యజమాని కారును గుర్తుపట్టి వెంబండించారు. దొరికిపోతానన్న భయంతో కారు వేగం పెంచి, పలు వాహనాలకు ఢీ కొట్టాడు. దీంతో స్థానికులు కారు ఆపి అతడిని చితకబాదారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్‌ ఆర్‌నగర్‌ ప్రాంతంలో ఉండే మోహన్‌రెడ్డి కార్లు అద్దెకు ఇచ్చే వ్యాపారం చేస్తుంటాడు. కార్లను పలు యాప్‌ల ద్వారా, తెలిసిన వారికి అద్దెకిచ్చేవాడు. గతేడాది అక్టోబర్‌ 25న జూమ్‌ యాప్‌ ద్వారా పాతబస్తీ జహనుమ ప్రాంతానికి చెందిన మహమ్మద్‌ అమీర్‌ అలీ(30) కారు (టీఎస్‌09 ఎఫ్‌డబ్ల్యు 9642) సెల్ఫ్‌ డైరవ్‌ చేయడానికి అద్దెకు తీసుకున్నాడు.
తిరిగి ఇవ్వకుండా.. నంబర్‌ ప్లేట్‌ మార్చి తిరుగుతున్నాడు. శుక్రవారం రాత్రి అమీర్‌పేటలో అమీర్‌ అలీ కారు నెంబర్‌ మార్చి (టీఎస్‌04 యుసీ 9932) అదే కారులో వెళ్తుండగా చూశాడు. యజమాని కారును గుర్తించి వెంటపడగా, గమనించిన అమీర్‌ అలీ దొరికిపోతాననే భయం తో కారును వేగంగా పంజాగుట్ట వైపు పోనిచ్చాడు.

ఈ క్రమంలో వాహనాలను ఢీ కొడుతూ వచ్చాడు. పంజాగుట్ట అగర్వాల్‌ ఆసుపత్రి సమీపంలో కారును ఆపగా, స్థానికులు అమీర్‌ అలీపై దాడి చేశారు. పంజాగుట్ట పోలీసులు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ అతన్ని చికిత్స నిమిత్తంగాంధీ ఆసుపత్రికి, కారును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కారు యజమాని ఇంతకు ముందే ఎస్‌.ఆర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసి ఉన్నాడు. అమీర్‌ అలీ పై రామచంద్రాపురం, తదితర పీఎ్‌సలలో కేసులు ఉన్నట్లు సమాచారం.