ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అస్వస్థతకు గురయ్యారు. స్పృహ తప్పికిందపడిపోయారు. ఆ వివరాల్లోకి వెళితే.. అఖిల ప్రియ దొర్నిపాడు మండలం డబ్ల్యూ గోవిందిన్నెలో జరిగిన మూల పెద్దమ్మ దేవరలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గరుడ దీపాన్ని మోశారు. గరుడ దీపం మోసిన తర్వాత ఆమె అస్వస్థతకు గురయ్యారు. బీపీ కారణంగా స్పృహ తప్పిపడిపోయారు. ఆమెను వెంటనే అంబులెన్స్లో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. భూమా అఖిల ప్రియ అస్వస్థతకు గురయ్యారని తెలియటంతో టీడీపీ శ్రేణులు భారీగా ఆస్పత్రికి చేరుకున్నారు.
11 ఏళ్ల తర్వాత దేవర
డబ్ల్యూ గోవిందిన్నె మూల పెద్దమ్మ దేవరకు జిల్లాలో ఎంతో విశిష్టత ఉంది. 11 ఏళ్ల తర్వాత ఇప్పుడు దేవర జరుగుతోంది. ఆదివారం నుంచి దేవర మొదలైంది. మొత్తం మూడు రోజుల పాటు దేవర జరగనుంది. 8వ తేదీ దేవీ ఉత్సవం జరిగింది. ఈ రోజు(సోమవారం) గండదీప పూజలు జరిగాయి. 10వ తేదీన.. అంటే మంగళవారం ఎల్లమ్మ పూజలు జరుగుతాయి. ఎల్లమ్మ పూజలతో దేవర ముగుస్తుంది. దేవర నేపథ్యంలోనే గోవిందిన్నే జన సంద్రంగా మారింది. బంధుమిత్రులతో గ్రామంలోని ఇళ్లు కళకళలాడుతున్నాయి.