ఇన్నాళ్లూ మహిళలకు పరిమితం అయిన పొదుపు సంఘాలను మెప్మా పురుషులకూ విస్తరిస్తోంది. ఫస్ట్ ఫేజ్లో రాష్ట్ర వ్యాప్తంగా 2,841 గ్రూపులను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకోగా..
నెల రోజుల్లోనే 1,028 సంఘాలు ఏర్పడ్డాయి. మార్చి 31 నాటికి టార్గెట్ను చేరుకునేలా అధికారులు యాక్షన్ ప్లాన్ రూపొందించారు. రోజువారీ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, సెక్యూరిటీ గార్డులకు ఆర్థిక స్వావలంబన కోసం పొదుపు సంఘాలు ఉపయోగపడుతాయని చెబుతున్నారు. కాగా పురుష సంఘాలను కామన్ ఇంట్రెస్టు గ్రూపుగా పిలుస్తున్నారు.
పొదుపు సంఘాల్లో చేరాలంటే 18 – 60 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఐదుగురు కలిసి ఓ గ్రూప్గా ఏర్పాటు కావొచ్చు. ఆధార్, రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ప్రతి నెల కనీసం రూ.100 నుంచి రూ.1000 వరకు పొదుపు చేయవచ్చు. ఆరు నెలల తర్వాత రివాల్వింగ్ ఫండ్ కింద ప్రభుత్వం రూ.25 వేలు ఇస్తుంది. ఈ తర్వాత ఈ మొత్తాన్ని పెంచుకుంటూ పోతుంది. మెప్మా కార్యాలయ సిబ్బందిని కలిస్తే గ్రూపును ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు, రిక్షా డ్రైవర్లు, వాచ్ మన్, జొమాటో, స్విగ్గీ డెలవరీ బాయ్స్, ప్రైవేటుగా పనిచేసుకునే కార్మికులు, వీధి వ్యాపారులు ఈ గ్రూపుల్లో చేరవచ్చు.