AP Elections 2024: అల్లర్లపై రంగంలోకి సిట్… త్వరలో కీలక నేతల అరెస్ట్‌లు..!

అమరావతి: ఏపీలో వైఎస్సార్సీపీ (YSRCP)ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో దాడులు పెరిగిపోయాయి. ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024)పోలింగ్ జరిగిన రోజు దగ్గరి నుంచి వరుసగా ఘటనలు జరుగుతున్న విషయం తెలిసిందే.


ప్రజలను, ప్రతిపక్షాలను వైసీపీ మూకలు భయపెడుతూ అరాచకాలు, అల్లర్లకు పాల్పడుతున్నాయి.మరోసారి అధికారంలోకి ఎలాగైనా రావాలని పెద్ద ఎత్తున కుట్రలకు పాల్పడుతున్నాయి.

అయితే వైసీపీ మూకలు చేస్తున్న అల్లర్లు, అరాచకాలపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో పిన్నెల్లి సోదరులు చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు. పల్నాడుతో పాటు అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, తిరుపతిలో చెలరేగిన హింసపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

పల్నాడు జిల్లాలో అల్లర్లపై సిట్ ఆరా…

పల్నాడు జిల్లాలో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన ఘటనలపై సిట్ దర్యాప్తు జరుపుతోంది. ఈ మేరకు పల్నాడు జిల్లాలో ఈరోజు (శనివారం) సిట్ బృందం పర్యటిస్తోంది. అలాగే నరసరావుపేటలో పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపై ఆరా తీస్తోంది. టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసులకు కారణమైన వారిపై సిట్ బృందం వివరాలు అడిగి తెలుసుకుంటుంది. టీడీపీ- వైసీపీ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదులపై సిట్ బృందం ఆరా తీస్తుంది. ఆయా పోలీస్ స్టేషన్లలో నుంచి సిట్ బృందం విచారణ చేపడుతున్నట్లు సమాచారం.

దర్యాప్తులో వేగం..

పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన దాడులపై సరైన చర్యలు తీసుకోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ఈసీ బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే. దీంతో పాటు మరికొంత మంది అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. హింసకు పాల్పడుతుంటే పోలీసులు ఎవరికి కొమ్ము కాశారని ఎన్నికల కమిషన్ ప్రశ్నించింది. దాడులకు ఇంకా ఎవరు సహకరించారనే దానిపై పూర్తి దర్యాప్తు చేయడానికి సీట్‌ను ఎన్నికల సంఘం నియమించింది.

ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. 13 మంది పోలీసులతో కూడిన అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ విచారణలో ఎంతటి వ్యక్తులు పాల్గొన్న దర్యాప్తునకు వెనకాడబోవద్దని సీట్‌కు ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తులో సిట్ వేగం పెంచినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే దాడులకు స్పంచ్ఛదంగా, పరోక్షంగా సహకరించిన కొంతమంది నేతలపై ఈసీ కన్నెర్ర జేసింది. ఇందులో భాగంగానే కీలక నేతలపై ఈసీ, సిట్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వారు ఎంతటి వారయినా ఉపేక్షించేది లేదని వదలిపెట్టబోవద్దని హెచ్చరించింది. ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్‌కు సిట్ కీలక వివరాలు అందజేస్తున్నట్లు తెలుస్తోంది.

తొలిసారిగా సిట్ ఏర్పాటు

కాగా.. ఈసీ ఆదేశాలతో ఐజీ వినీత్‌, బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో దర్యాప్తులో వేగం పెంచింది. సిట్ ఇస్తున్న నివేదికలతో ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇంతవరకు ప్రత్యేకంగా సిట్‌ను ఏర్పాటు చేయలేదు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు పెరిగిపోవడంతో సిట్‌ను ఏర్పాటు చేయాల్సిన అవశ్యకత ఏర్పడింది.

కుంభకోణాలు, భారీ స్కాములు జరిగితేనే సిట్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. కానీ తొలిసారిగా ఏపీలో అధికార వైసీపీకి పోలీసులు వత్తాసు పలకటంతోనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సీట్ ఇచ్చే నివేదికపై కీలక నేతల్లో ఉత్కంఠత నెలకొంది. కాగా.. ఇప్పటికే కొంత మంది నేతలు పక్క రాష్ట్రాలకు పారిపోయినట్లు సమాచారం. ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకుంటుందని తెలియడంతో ముందస్తుగా వారు ఏపీ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లి తలదాచుకుంటున్నట్లు తెలుస్తోంది.