AP Revenue Department: ఏపీ రెవెన్యూ శాఖలో కీలక ఆదేశాలు..

ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ కీలక ఆదేశాలు చేసింది. కీలక ఫైళ్లను ప్రాసెస్ చేయొద్దంటూ రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే.. రెవెన్యూ శాఖ పరిధిలోని కాంట్రాక్టర్లకు నిధుల విడుదల, భూ కేటాయింపుల వంటి ఫైళ్లని నిలుపుదల చేయాలని ఆదేశాలు ఇచ్చారు. రెవెన్యూ మంత్రి పేషీలోని రికార్డులు, ఫైళ్లను జాగ్రత్త పరచాలని పేషీ సిబ్బందికి సూచించింది.


మరోవైపు.. సచివాలయంలో రికార్డులు తారుమారుపై అధికారులు అలర్ట్ అయ్యారు. పలు కీలక విభాగాల్లో రికార్డులను భద్రపర్చాలని జీఏడీ ఆదేశాలు జారీ చేసింది. రాజ్ భవన్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్ఓడీలకు జీఏడీ సర్క్యులర్ జారీ చేసింది. సీఎస్ కార్యాలయం సహా వివిధ శాఖల కార్యదర్శులకు ఫైళ్లను డేటాను సేఫ్టీగా ఉంచాలని ఆదేశించింది. గవర్నర్ ఆదేశాల మేరకు సర్కులర్ జారీ చేస్తోన్నట్టు జీఏడీ వెల్లడించింది. భూముల కేటాయింపులు, కాంట్రాక్టర్లకు నిధుల విడుదల, ఉన్నతాధికారుల బదిలీలు వంటి ఫైళ్లను ప్రాసెస్ చేయొద్దని జీఏడీ స్పష్టం చేసింది. ఫైళ్లతో పాటు ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న రికార్డులను భద్రపరిచేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.