ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. జీతాలు మళ్లీ పెరిగే చాన్స్!

www.mannamweb.com


కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్ డేట్ వచ్చింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించిన కీలక అంశం ఇది. 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఓ ప్రతిపాదన వచ్చింది. ఇండియన్ రైల్వేస్ టెక్నికల్ సూపర్ వైజర్స్ అసోసియేషన్(ఐఆర్టీఎస్ఏ) ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది. డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీఓపీటీ) ఆధ్వర్యంలోని పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వ శాఖకు ఈ ప్రతిపాదనను ఓ లేఖ ద్వారా తెలియజేసింది. దానిలో కొత్త సీపీసీ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని వివరించింది. కొత్త సీపీసీకి ఇదే సరైన సమయమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అసలు వేతన సంఘం అంటే ఏమిటి? అది ఎందుకు ఏర్పాటవుతుంది? ఎలా పనిచేస్తుంది? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

వేతన సంఘం(పే కమిషన్) అంటే..
వేతనం సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. దీనిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల స్ట్రక్చర్ ఎలా ఉంది? దానిలో చేయాల్సిన మార్పులు చేర్పులు ఏంటి? ఒకవేళ జీతాలు పెంచాలా? వంటి కీలక అంశాలు దీని ప్రతిపాదనల ద్వారానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. సాధారణంగా, జీతం, అలవెన్సులు మరియు ఇతర సౌకర్యాలు/ప్రయోజనాలు/ సహా వేతనాల నిర్మాణాన్ని నియంత్రించే సూత్రాలను పరిశీలించడానికి, సమీక్షించడానికి, అభివృద్ధి చేయడానికి, మార్పులను సిఫార్సు చేయడానికి పది సంవత్సరాల వ్యవధిలో ఈ కేంద్ర పే కమిషన్‌ను ఏర్పాటు చేస్తారు. 3వ, 4వ, 5వ వేతన కమీషన్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, అలవెన్సులు, సర్వీస్ షరతుల కాలానుగుణ సమీక్ష కోసం శాశ్వత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేశాయి.

8వ పే కమీషన్ – ఐఆర్టీఎస్ఏ డిమాండ్లు ఇవి..
ఇండియన్ రైల్వేస్ టెక్నికల్ సూపర్ వైజర్స్ అసోసియేషన్(ఐఆర్టీఎస్ఏ) నుంచి వచ్చిన లేఖలో అనేక కీలకమైన డిమాండ్‌లు ఉన్నాయి. మొదటి డిమాండ్ కొత్త కేంద్ర వేతన సంఘం ఏర్పాటు చేసి వివిధ వర్గాల ఉద్యోగుల జీతాలలో ఉన్న అసమానతలు, క్రమరాహిత్యాలను సరిదిద్దాలని కోరింది. అంతేకాకుండా, వేతనాలు అలవెన్సులు, పని పరిస్థితులు, ప్రమోషనల్ మార్గాలు, పోస్ట్ వర్గీకరణలకు సంబంధించి ఇప్పటికే ఉన్న అన్ని క్రమరాహిత్యాలను క్లియర్ చేయడానికి పే కమిషన్‌కు తగినంత సమయం కేటాయించాలని అసోసియేషన్ కోరుతోంది. ప్రస్తుతం ఉన్న అన్ని అవకతవకలను క్లియర్ చేయడానికి మరియు భవిష్యత్తులో అవకతవకలకు అవకాశం ఇవ్వకుండా సమగ్ర సిఫార్సులు ఇవ్వడానికి తగిన సమయం ఉండేలా 8వ కేంద్ర వేతన సంఘాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని అభ్యర్థిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఒకవేళ 8 వ వేతన సంఘం ఏర్పాటు జరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు, జీతాల సవరణపై ప్రభావం చూపుతుంది.