టీచర్ల బదిలీలపై నిరాధార ఆరోపణలు- ఖండించిన బొత్స సత్యనారాయణ!

పత్రికా ప్రకటన


టీచర్ల బదిలీలపై నిరాధార ఆరోపణలు- ఖండించిన బొత్స సత్యనారాయణ!

కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకోడానికి వీలుగా
బదిలీలు నిలిపివేయాలని అధికారులకు నేనే విజ్ఞప్తి చేశా.

పత్రికా ప్రకటనలో బొత్స సత్యనారాయణ స్పష్టీకరణ

విజయనగరం, జూన్ 7

రాష్ట్రంలోని పాఠశాల విద్యా శాఖ పరిధిలో గతంలో జరిగిన ఉపాధ్యాయుల బదిలీల నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయం, దరిమిలా దానిపై ఆరోపణలతో పత్రికలు వార్తాంశాలు ప్రచురించాయి. నాపై వ్యక్తిగతమైన ఆరోపణలు చేస్తూ ప్రచురితమైన వార్తాంశాలు పూర్తిగా అవాస్తవం, అభూత కల్పనలతో నా వ్యక్తిత్వ హననానికి చేస్తున్న ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఎన్నికలకు ముందు నుంచీ కూడా ఇవే ఆరోపణలతో అనేక సార్లు వార్తలు ప్రచురించగా, అప్పుడే ఖండించిన విషయాలను మీకు గుర్తు చేస్తున్నాను.ఇప్పుడు మరోసారి ఖండిస్తున్నాను, గర్హిస్తున్నాను.
కొంత మంది ఉపాధ్యాయులు తమ ఆరోగ్య, కుటుంబ ఇతరత్రా ఇబ్బందులు, వివిధ వ్యక్తిగత సమస్యల రీత్యా బదిలీలు కోరుకుంటూ ఆర్జీ పెట్టుకోవడం జరిగింది. వాటిని పూర్తి పారదర్శకంగా పరిశీలించి క్షేత్ర స్థాయి నుంచి నివేదికలు తెప్పించుకున్న తరువాతనే అప్పట్లో నిర్ణయం తీసుకోవడమైనది.
ఈ నేపథ్యంలో ఫలితాలు వెలువడిన వెంటనే ఈ బదిలీలు నిలిపేయాల్సిందిగా సంబంధిత అధికారులను నేనే స్వయంగా కోరడం జరిగింది. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం వస్తున్న నేపథ్యంలో ఈ విషయంలో వారు తమకు నచ్చిన నిర్ణయం తీసుకోవచ్చు. బదిలీల కోసం అర్జీచేసుకున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిగణలోకి తీసుకుంటారా? లేదా? అన్నది కొత్త ప్రభుత్వం ఇష్టం. వాస్తవాలు ఇలా ఉంటే బదిలీలకోసం లంచాలు తీసుకున్నారంటూ తప్పుడు ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాంటి తప్పుడు పనులు చేయాల్సిన అగత్యం, అవసరం మాకు లేవు.

బొత్స సత్యనారాయణ
మాజీ మంత్రివర్యులు

Issued by O/o the Ex. Minister for Education