NEET PG 2024: నీట్ పీజీ పరీక్ష విధానంలో మార్పులు, కొత్తగా ‘టైమ్-బౌండ్ సెక్షన్’ అమలు

National Board Of Examinations- నీట్‌ పీజీ-2024 పరీక్షల విధానంలో మార్పులు చేస్తున్నట్లు నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఫర్‌ మెడికల్‌ సైన్సెస్‌(NBEMS) ప్రకటించింది. కొత్త విధానంలో ప్రకారం నీట్ పీజీ పరీక్షలో టైమ్-బౌండ్ సెక్షన్ (Time Bound Sections) విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. నీట్‌ పీజీతోపాటు.. నీట్‌ ఎండీఎస్‌ (NEET MDS), నీట్‌ ఎస్‌ఎస్‌, ఎఫ్‌ఎంజీఈ, డీఎన్‌బీ పీడీసీఈటీ (DNB PDCET), జీపీఏటీ, డీపీఈఈ (DPEE), ఎఫ్‌డీఎస్‌టీ (FDST), ఎఫ్‌ఈటీ (FET) పరీక్షల్లో ఈ కొత్త మార్పును తీసుకురానున్నట్లు NBEMS వెల్లడించింది.


అసలేంటి టైమ్‌ బౌండ్‌ సెక్షన్స్‌..?
టైమ్‌ బౌండ్‌ సెక్షన్స్‌ విధానం అనేది కంప్యూటర్‌ ఆధారిత విధానంలో నిర్వహించే పరీక్షలో సెక్షన్ల వారీగా సమయం కేటాయించడం. దీనిప్రకారం క్వశ్చన్ పేపర్‌ను సెక్షన్ల వారీగా విభజించి.. ప్రతి సెక్షన్‌కు కొంత సమయం కేటాయిస్తారు. ఆ సెక్షన్‌ను ఇచ్చిన సమయంలో పూర్తిచేసిన తర్వాతనే తర్వాతి సెక్షన్‌ ఓపెన్‌ అవుతుంది. మల్టిపుల్‌ఛాయిస్ ప్రశ్నలతో నిర్వహించే నీట్‌ పీజీతో పాటు NBEMS నిర్వహించే ఇతర పరీక్షల సమయంలో ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో పరీక్షల సెక్యూరిటీ, ప్రాముఖ్యతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

కొత్త విధానం ప్రకారం..

➥ నీట్‌ పీజీ-2024 పరీక్ష ప్రశ్నపత్రంలో A, B, C, D, E అనే టైమ్‌ బౌండ్‌ సెక్షన్లు ఉండనున్నాయి. ప్రతి సెక్షన్‌లో 40 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో సెక్షన్‌కు 42 నిమిషాల సమయం ఇస్తారు. ఇచ్చిన సమయంలో ఆసెక్షన్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే అభ్యర్థి మరో సెక్షన్‌కు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఇదేవిధంగా ప్రతి సెక్షన్‌కు సమయం కేటాయింపు ఉంటుంది.

➥ అభ్యర్థులకు కేటాయించిన సమయం ముగిసిన తర్వాత ఒక సెక్షన్‌లోని ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలను మార్చేందుకు వీలు ఉండదు. ఇచ్చిన సమయంలో సంబంధిత సెక్షన్‌లో ఒక ప్రశ్నను రివ్యూ చేసుకొనేందుకు మార్కింగ్‌ ఆప్షన్‌ కూడా ఉంటుందని ఎన్‌బీఈఎంఎస్‌ తెలిపింది.