అప్పుడు బాబాయ్.. ఇప్పుడు చెల్లి.. కాంగ్రెస్‌పై CM జగన్ సెన్సేషనల్ కామెంట్స్

కాంగ్రెస్ పార్టీపై వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ చెత్త రాజకీయాలు చేస్తోందని జగన్ ధ్వజమెత్తారు.
గతంలో మా బాబాయ్‌ను నాపై పోటీకి నిలబెట్టారు.. ఇప్పుడు మా సోదరిని ప్రయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం తిరుపతిలో ఇండియాటూడే ఎడ్యుకేషన్ సమ్మిట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గెస్ట్‌గా వచ్చిన జగన్ మాట్లాడుతూ.. తమ కుటుంబాన్ని చీల్చి కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని నిప్పులు చెరిగారు. కుటుంబాల్లో విభేదాలు సృష్టించి పాలిటిక్స్ చేస్తోన్న వాళ్లకు దేవుడే బుద్ధి చెబుతారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు స్థానం లేదని.. టీడీపీ, జనసేన పార్టీలతోనే ఎన్నికల్లో తమ పోటీ అని జగన్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసమే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నామని క్లారిటీ ఇచ్చారు. ఇష్యూ బేస్డ్ విషయంలో కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇస్తామని జగన్ కుండబద్దలు కొట్టారు. సర్వేల ఆధారంగానే వైసీపీ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చామని.. ప్రజా వ్యతిరేకత ఉన్నందునే కొందరికి టికెట్లు ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు. ప్రజలు మా వైపే ఉన్నారని భావిస్తున్నానని.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ విజయం సాధిస్తామని జగన్ దీమా వ్యక్తం చేశారు.