Crime News: తండ్రికి నెలకు రూ.1.2 లక్షల పింఛన్‌.. మృతదేహాన్ని ఏళ్లపాటు ఇంట్లోనే దాచిపెట్టి!

తండ్రికి వచ్చే పింఛన్‌ కోసం ఓ మహిళ చేసిన దారుణం విస్తుపోయేలా చేస్తోంది. ఆయన మృతదేహాన్ని ఇంట్లోనే ఏళ్లపాటు దాచిపెట్టింది. ఈ ఘటన తైవాన్‌లో వెలుగు చూసింది. అక్కడి మీడియా కథనం ప్రకారం..


ఆమె తండ్రి సైన్యంలో 20 ఏళ్ల పాటు పనిచేశారు. హోదా, సర్వీసు బట్టి ఆయనకు నెలకు దాదాపు రూ.1.27 లక్షల పెన్షన్‌ వస్తుందని అంచనా. కొన్నేళ్లుగా పింఛను ఉపసంహరణ జరుగుతున్నప్పటికీ.. ఆ వృద్ధుడు మాత్రం కనిపించ లేదు. ఇదే సమయంలో కుమార్తె తీరు.. అధికారుల్లో అనుమానాలకు కారణమయ్యింది. ముఖ్యంగా డెంగీ నివారణ చర్యల్లో భాగంగా ఇంటికి వచ్చిన వైద్య సిబ్బందిని ఆమె లోనికి అనుమతించలేదు. దీంతో ఆమెకు సుమారు రూ.లక్షన్నర జరిమానా విధించారు. ఇలా మరోసారి కూడా ప్రభుత్వ అధికారులను ఇంట్లోకి రానివ్వకపోవడంతో అనుమానం మరింత పెరిగింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.

ఆమె తండ్రి ఆచూకీ గురించి ఆరా తీయగా.. నర్సింగ్‌ హోమ్‌లో ఉన్నట్లు తొలుత బుకాయించింది. మరిన్ని ప్రశ్నలు వేసేసరికి మరో కట్టుకథ అల్లింది. వేరే నగరంలో ఉన్న తన సోదరుడి దగ్గర ఉన్నాడని తెలిపింది. పోలీసుల విచారణలో.. ఆమె సోదరుడు చాలా ఏళ్ల క్రితమే మరణించినట్లు తేలింది. ఇదే విషయాన్ని ఆమెకు చెప్పగా.. తండ్రి చనిపోయాడని, మరణ ధ్రువీకరణ పత్రం పొందలేదని తెలిపింది. ఇలా అనేక కథలు చెబుతుండటంతో పోలీసులు.. చివరకు ఆమె ఇంట్లో సోదాలు జరిపేసరికి అసలు విషయం బయటపడింది. ఓ ప్లాస్టిక్‌ బ్యాగులో మానవ ఎముకలు గుర్తించడం సంచలనం రేపింది.

దర్యాప్తు చేసిన అధికారులు.. రెండేళ్ల క్రితమే ఆయన చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. అయితే, వృద్ధుడి మరణానికి గల కారణాలు మాత్రమే తెలియలేదు. కుమార్తెనే చంపిందా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతడికి రావాల్సిన పింఛన్‌ మాత్రం క్రమంగా విత్‌డ్రా అవుతున్నట్లు గుర్తించారు.