IRS Officer: డేటింగ్ యాప్‌లో పరిచయం.. 3 నెలలకే సివిల్ సర్వెంట్ ఫ్లాట్‌లో యువతి డెడ్‌బాడీ లభ్యం! ఏం జరిగిందో..

ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్‌) అధికారికి డేటింగ్‌ యాప్‌లో పరిచయమైన మహిళ.. మూడు నెలలకే అతడి ప్లాట్‌లో శవమై కనిపించింది. స్థానికంగా తీవ్రకలకలం రేపిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని సెక్టార్ 100లోని లోటస్ బౌలేవార్డ్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఐఆర్‌ఎస్‌ అధికారి సౌరభ్ మీనా నివాసం ఉంటున్నారు. ఆయనకు బీహెచ్‌ఈఎల్‌లో హెచ్‌ఆర్‌ శిల్పా గౌతమ్‌తో డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. ఏం జరిగిందో తెలియదు గానీ శనివారం మధ్యాహ్నం శిల్పా గౌతమ్‌.. ఐఆర్‌ఎస్‌ ఆఫీసర్‌ సౌరభ్ మీనా ప్లాట్‌లో ఉరివేసుకుని కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శిల్పా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శిల్పా, సౌరభ్‌ల మధ్య గత మూడేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోందని గౌతమ్‌ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.


డేటింగ్‌ యాప్‌ ద్వారా వీరికి పరిచయం ఏర్పడిందని, త్వరలోనే పెళ్లి చేసుకుంటానని నమ్మించి సౌరభ్‌ తన కుమార్తెను మోసం చేసినట్లు మృతురాలి తండ్రి గౌతమ్‌ తెలిపారు. శిల్పా, సౌరభ్‌ల మధ్య గత మూడేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోందని గౌతమ్‌ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతో వీరి మధ్య గతకొంత కాలంగా గొడవలు జరుగుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆమెను భౌతికంగా వేధించడంతోపాటు చివరకు హత్య కూడా చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరోవైపు శిల్పా తండ్రి ఆరోపణలను సౌరభ్‌ ఖండించాడు. తమకు మూడు నెలల కిందటే డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయం ఏర్పడిందని, ఆమె తల్లిదండ్రులు చెబుతున్నట్లు మూడేళ్ల క్రితం కాదని పోలీసులకు తెలిపాడు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, సౌరభ్‌ను అదుపులోకి తీసుకున్నారు. సౌరభ్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు శిల్పా మరణంపై దర్యాప్తు చేస్తున్నట్లు నోయిడా అదనపు డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (DCP) మనీష్ కుమార్ మిశ్రా తెలిపారు. పోలీసులు సౌరభ్‌ను కోర్టులో హాజరుపరిచగా.. కోర్టు అతనికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ మిశ్రా తెలిపారు. శిల్పా మృతికి గల కారణాలను తెలుసుకోవడానికి పోస్ట్‌మార్టం నివేదిక రావల్సి ఉందని, ఈలోగా శిల్పా-సౌరభ్‌ల మొబైల్ ఫోన్‌లను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఫ్లాట్‌లోని సీసీటీవీ పుటేజీని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.