Diabetics: మధుమేహ రోగులకు గుడ్ న్యూస్.. ఇకపై 14 రోజుల్లోనే..!

మధుమేహం ఇది ప్రపంచదేశాలను పట్టి పీడిస్తున్న సమస్య. దీనిని ప్రాధమిక దశలో గుర్తిస్తే సరైన ఆహారపు అలవాట్లు, వ్యాయామాలతో నియంత్రించుకోవచ్చు. అదే ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే మెడికేషన్ తప్పనిసరి.
అయితే ప్రపంచ దేశాలతో పోటీ పడి మన భారత్ కూడా దీనిపై అనేక ప్రయోగాలు చేస్తోంది. తద్వారా కొంత మేర సత్ఫలితాలను సాధిస్తోంది. ఇటీవల చేసిన సరికొత్త అధ్యయనంలో కేవలం 14రోజుల్లోనే మధుమేహాన్ని నియంత్రించవచ్చని తేలింది. ఇది ఏ హోమియోపతి, అల్లోపతి వైద్యంతో కాదు పూర్తి ఆయుర్వేద చికిత్సతో షుగర్ లెవెల్స్ అదుపులోకి తీసుకురావచ్చని నిరూపితమైంది. దీనిపై పరిశోధనలు చేస్తున్నారు వైద్యనిపుణులు.


భారతదేశంలో రోజు రోజుకు పెరుగుతున్న షుగర్ పేషెంట్స్ ఎక్కువైపోతున్నారు. దీనికి కారణం సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం, శరీరానికి తగిన వ్యాయామం కల్పించకపోవడం. రాత్రి ఆలస్యంగా పడుకొని ఉదయం త్వరగా లేయకపోవడం. ఐటీ రంగం అభివృద్ది చెందిన తరుణంలో ఎనిమిది నుంచి 10 గంటల పాటూ ఒకే చోట స్థిరంగా కూర్చొని పని చేయడం. ఇవన్నీ డయాబెటిక్ టైప్ 1కి కారణం అవుతున్నాయి. దీనిని తొలిదశలోనే గుర్తించకుండా వ్యాధి తీవ్రతను పెంచుకుంటున్నారు. అయితే పాట్నాలో ఈమధ్య కాలంలో చేసిన అధ్యయనంలో కేవలం 14 రోజుల్లోనే డయాబెటిస్‌ను అదుపులోకి తీసుకువచ్చినట్లు నిరూపితమైంది.

పాట్నాకు చెందిన ఆయుర్వేద కళాశాల, ఆసుపత్రి వైద్యులు ఓ వ్యక్తి కేంద్రంగా చేసుకుని మధుమేహం సమస్యపై ప్రయోగం చేశారు. ఆరోగ్యకరమైన వాతావరణంతో పాటూ, మంచి ఆహారాన్ని సరైన సమయానికి మితంగా అందించారు. దీంతో పాటూ షుగర్ లెవెల్స్‌ను నియంత్రించే బీజీఆర్34 అనే ఔషధమూలకాలతోపాటూ ఆరోగ్యవర్థిని వాతి, చంద్రప్రభావతి అనే మందులను అందించారు. 14 రోజుల చికిత్స తరువాత షుగర్ వ్యాధితో బాధపడుతున్న ఆ వ్యక్తి రక్తపు నమూనాలను సేకరించి పరీక్షించారు. అద్భుతమైన ఫలితాలు వెలుగులోకి వచ్చాయి. చికిత్సకు ముందు పరగడుపున సేకరించిన రక్తపు శాంపిల్స్‌లో 254 ఎంజీ ఉంటే.. చికిత్స తరువాత 124 ఎంజీకి షుగర్ విలువలు పడిపోయాయి. అలాగే తిన్న తరువాత సేకరించిన శాంపిల్స్‌లో 413 ఎంజీ ఉండగా.. చికిత్స తరువాత 154కు తగ్గింది. దీనిపై పరిశోధనలు జరిపి రానున్న రోజుల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తామని వైద్యనిపుణులు తెలిపారు.