అన్నం తింటే షుగర్ స్థాయి పెరుగుతుందనేది కేవలం అపోహ మాత్రమేనని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్ పీవీ సత్యనారాయణ తెలిపారు.
అన్నంతోపాటు పప్పు, కూరగాయలు, నెయ్యి, మాంసాహారం కలిపి తింటాం కాబట్టి షుగర్ గురించి ఆందోళన అవసరం లేదన్నారు. గురువారం ఆయన యూనివర్సిటీలో ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిదితో మాట్లాడారు. ”బియ్యం రకం, మిల్లు ఆడించే పద్ధతిని బట్టి అన్నంలో గ్లైసెమిక్ ఇండెక్స్ (రక్తంలో చక్కెరస్థాయిని కొలిచే సూచిక) విలువలు మారిపోతాయి. ఉదాహరణకు ముడి బియ్యంలో కంటే ఎక్కువగా చక్కెర స్థాయిలు తెల్ల బియ్యంలో ఉంటాయి. బియ్యం పాలిష్ పట్టే సమయంలో బయటి ఊక పొర తొలగించడం వల్ల చక్కెర శాతం పెరుగుతుంది. దేశవాళి బియ్యం, ఎర్ర బియ్యంలో అధిక పీచు, పోషకాలు ఉంటాయి. ఈ కారణంగా తక్కువ చక్కెర స్థాయిలు ఉంటాయి. ఏపీలో ఎక్కువగా వినియోగించే సాంబ మసూరిలో కూడా ఇవి తక్కువగానే ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది.” అని ఆయన వివరించారు. చద్దన్నం తినడం ద్వారా ఆయుష్షును మరింత పెంచుకోవచ్చునని ఆయన తెలిపారు.
బీపీటీ బియ్యంలో…
చక్కెర శాతం తక్కువగా ఉంటే బియ్యం రకాల రూపకల్పనకు మరిన్ని ప్రయత్నాలు జరగాల్సిన ఆవశ్యకత ఉందని డాక్టర్ పీవీ సత్యనారాయణ తెలిపారు. ఎన్జీ రంగా యూనివర్సిటీ నుంచి విడుదలైన బీపీటీ 5204, బీపీటీ 2270, ఎంటీయూ 1224, బీపీటీ 2841 రకాలు తక్కువ చక్కెర స్థాయులను కలిగినట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. దేశావళి బియ్యం రకాలైన ఇంద్రాణి, రక్తశాలి కూడా మధ్యస్థంగా చక్కెర స్థాయిలు కలిగిఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు.
‘ప్రొటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులను అన్నంతో కలిపి తీసుకోవడంవల్ల రక్తంలో గ్లూకోజ్ విడుదల నెమ్మదిగా జరుగుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే సజ్జ, జొన్న వంటి చిరుధాన్యాలు, కూరగాయలు, గింజలు తినడం ఉత్తమం. ఆహారంలో ఫైబర్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ నెమ్మదించి చక్కెర స్థాయులు పూర్తిగా నియంత్రణలో ఉంటాయి. నిమ్మరసం కలిపిన ఆహారం తీసుకోవడం మంచిది.”
































