Crime News: ఒంగోలులో దారుణం.. కుమారుడిని తుపాకీతో కాల్చి చంపిన తండ్రి

Crime News: ఒంగోలులో దారుణం.. కుమారుడిని తుపాకీతో కాల్చి చంపిన తండ్రి


జీతం వచ్చిన రోజే డబ్బులడిగాడనే ఆగ్రహంతో కన్న కుమారుడిని తుపాకీతో ఓ తండ్రి కాల్చి చంపాడు. ఈ విషాద ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలు భాగ్యనగర్‌లోని ఈవీఎం గోదాములో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. త్రిపురాంతకం గ్రామానికి చెందిన కె.ప్రసాద్‌ అనే వ్యక్తి ఏఆర్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారులు ఆయనకు ఈవీఎంలు భద్రపరిచే గోదాము వద్ద పహారా విధులు కేటాయించారు. ఇందులో భాగంగా రాత్రి పది గంటల సమయంలో కుమారుడు శశికుమార్‌(22)తో కలిసి ద్విచక్ర వాహనంపై గోదాము వద్దకు వచ్చారు.

నిబంధనల ప్రకారం సదరు గోదాములోకి విధుల నిర్వహణలో ఉన్న సిబ్బంది తప్ప ఇతరులెవరూ ప్రవేశించకూడదు. అయినప్పటికీ ప్రసాద్‌ తన వెంట కుమారుడిని తీసుకెళ్లారు. ఒకటో తేదీ కావడంతో వేతనం తాలుకా డబ్బులు తనకు ఇవ్వాలని శశికుమార్‌ తండ్రిని అడిగారు. దీంతో ప్రసాద్‌ ఒక్కసారిగా విచక్షణ కోల్పోయారు. తీవ్ర ఆగ్రహంతో తన వద్ద ఉన్న తుపాకీతో కుమారుడి ఛాతీపై ఒక రౌండ్‌ కాల్పులు జరిపారు. బుల్లెట్‌ గాయాలతో శశికుమార్‌ అక్కడికక్కడే మృతిచెందారు. ఆ సమయంలో విధుల్లో ఉన్న సిబ్బంది అక్కడికి చేరుకుని ప్రసాద్‌ను నియంత్రించారు.