పండక్కి నాలుగు అరిశలు, బూరెలు వండుకు తినే పరిస్థితి కూడా లేదుగా

www.mannamweb.com


పండుగ సీజన్‌లో ప్రశాతంగా నాలుగు అరిశలు, బూరెలు వండుకొని తినడానికి ఆలోచించాల్సి వస్తోంది. భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు ఫెస్టివల్‌ మూడ్‌ను పాడు చేసింది.

గత కొన్ని రోజులుగా నిత్యావసరాల ధరలు సామాన్యులకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా మార్కెట్లో కూరగాయల ధరలు సెంచరీ దాటేశాయి. ఏ పచారీ సామాన్లకో, కాయగూరలకో సంచి పట్టుకుని బైటికెళితే.. గుండెలు బరువెక్కకుండా ఇంటికొస్తామన్న గ్యారంటీ లేకుండా పోతోంది. వంట నూనెలు భగ్గుమంటుంటే.. కూరగాయల ధరలు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. కొత్తిమీర కొనాలన్నా యాభైనోటు బైటికి తియ్యాల్సిన పరిస్థితి. పండగ సీజన్లో మిడిల్‌క్లాసోడ్ని భయపెట్టి చంపేస్తున్నాయి తాజా ధరలు.

దసరా పండుగ వేళ పెరిగిన వంట నూనె ధరలు సామాన్యుడి చేతి చమురు వదిలిస్తున్నాయి. పామాయిల్ గతంలో 95 రూపాయలు ఉంటే ఇపుడు 125కి చేరింది. సన్ ఫ్లవర్ ఆయిల్‌ 110 నుంచి 135కి పెరిగింది. ఇలా అన్ని ఆయిల్‌ రేట్లు పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

వరంగల్‌లో కిలో టమాట ధర వంద రూపాయలు పలుకుతుంది. దీపావళికి 150కి చేరే అవకాశం ఉందంటున్నారు వ్యాపారులు. విజయవాడ రైతు బజార్‌లో కిలో టమాట 70 రూపాయలు పలుకుతుంది. అయితే ప్రభుత్వం 4 రూపాయల సబ్సిడీ ఇచ్చి 66 రూపాయలకు అందిస్తుంది. హైదరాబాద్‌లోనూ ధరలు భారీగా పెరిగాయి.