ఆంధ్రప్రదేశ్ రాష్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.స్త్రీ శక్తి స్కీంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన కూటమి ప్రభుత్వం రుణాలు సైతం మంజూరు చేస్తున్న సంగతి తెలిసిందే.
అలాగే వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు రుణాలు సైతం అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో డ్వాక్రా మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంతోపాటు వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలను అమలు చేస్తోంది.
డ్వాక్రా మహిళలకు అదిరిపోయే గుడ్న్యూస్
ఏపీలోని డ్వాక్రా మహిళల వ్యాపారాలకు ప్రభుత్వం సబ్సిడీ రుణాలను అందిస్తోంది.డ్వాక్రా మహిళల స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు భారీ సబ్సిడీలతో కూడిన రుణాలను అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాలను అమలు చేయాలని నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లోని డ్వాక్రా మహిళలకు జీవనోపాధి కల్పించాలనే లక్ష్యంతో ‘వెలుగు”పశుసంవర్ధకశాఖ’లు సంయుక్తంగా లబ్ధిదారులను గుర్తిస్తున్నాయి.డ్వాక్రా సంఘాల సభ్యులతో గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి ఆసక్తి ఉన్న వారిని ఎంపిక చేయనుంది. ఎంపికైన వారికి పీఎంఈజీపీ, పీఎంఎఫ్ఎంఈ, స్త్రీనిధి వంటి పథకాల ద్వారా బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరు చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
పాడిపశువుల యూనిట్కు రుణాలు
డ్వాక్రా మహిళలకు పాడి, పశుసంపదలకు తొలివిడతగా రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పాడి పశువులు (ఆవులు, గేదెలు), గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం వంటి యూనిట్ల ఏర్పాటుకు రుణాలు ఇవ్వాలని ప్రధానంగా నిర్ణయించింది. ఈ పథకం అమలులో భాగంగా రూ.లక్ష విలువైన యూనిట్కు ప్రభుత్వం రూ.35 వేల సబ్సిడీ అందిస్తుండగా… మిగిలిన రూ.65 వేలను బ్యాంకులు రుణంగా సమకూరుస్తాయి. రెండు పశువులతోపాటు షెడ్డు నిర్మాణంతో కూడిన రూ.2 లక్షల యూనిట్కు అయితే రూ.75 వేల వరకు రాయితీ లభించనుంది. మిగిలిన రూ.1.25 లక్షలను బ్యాంకు రుణం ద్వారా పొందే అవకాశం కల్పించనుంది.
చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు కూడా రుణాలు
వీటితోపాటు పశుపోషణే కాకుండా ఇతర చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం రుణాలు ఇచ్చి ప్రోత్సాహం అందించనుంది. చిన్నతరహా పరిశ్రమలలో భాగంగా బేకరీలు, పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్లకు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అయ్యే ఖర్చులో సబ్సిడీతో లోన్స్ ఇవ్వనుంది ప్రభుత్వం.అలాగే వరికోత యంత్రాలు, రోటావేటర్ల వంటి వ్యవసాయ పరికరాలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు విలువైన యూనిట్లపై రూ.1.35 లక్షల వరకు రాయితీ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రుణాలను, సబ్సిడీలను మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్నయం తీసుకుంది.అంతేకాదు త్వరలోనే మహిళల కోసం భవిష్యత్తులో స్త్రీ నిధి, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి వంటి పథకాలను కూడా ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
































