మీరు వాట్సాప్ వాడుతున్నారా? ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నారా? ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్లకు రియాక్ట్ అవుతున్నారా..! అయితే జరభద్రం..మీరు కూడా ఇలాంటి కీచకుడి బారిన పడవచ్చు.
సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్లో అమ్మాయిలను మోసం చేస్తున్న కేటుగాడిని అరెస్ట్ చేశారు..ముంబై పోలీసులు. నిందితుడిని బీహార్కు చెందిన శుభం కుమార్ మనోజ్ప్రసాద్ సింగ్గా గుర్తించారు. కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు శుభం కుమార్. దాదాపు వంద మంది బాలికలు, మహిళల పేర్లతో ఈ-మెయిల్ ఐడీలు, 11 ఇన్స్టాగ్రామ్ ఖాతాలను క్రియేట్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ముంబైలోని ఒక కాలేజ్ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసిన శుభం కుమార్..ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ముంబైలోని దహిసర్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
శుభం కుమార్ ఫోన్ గ్యాలరీలో 13,500 మంది ఫోటోలు
శుభం కుమార్ మొబైల్ఫోన్ను ఓపెన్ చేసిన పోలీసులు అవాక్కయ్యారు. ఎందుకంటే అతడి ఫోన్ గ్యాలరీలో 13 వేల 500 మంది ఫోటోలు గుర్తించారు. తన నకిలీ ఖాతాలతో దేశవ్యాప్తంగా 300 మందికి పైగా మహిళలను బ్లాక్మెయిల్ చేశాడని అనుమానిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. శుభంకుమార్ ఇన్స్టాగ్రామ్లో నకిలీ ఐడీలతో అమ్మాయిలతో మొదట స్నేహం చేస్తాడు. ఆపై నగ్నంగా వీడియోకాల్లోకి రావాలని కోరుతాడు. వాళ్లు నిరాకరిస్తే వారి పేరుతో నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతాలను క్రియేట్ చేసి మార్ఫింగ్ ఫోటోలను పోస్ట్ చేస్తాడు. ఇదే విధంగా ముంబైకి చెందిన బాలిక ఫోటోలను మార్ఫింగ్ చేశాడు శుభంకుమార్. ఐపీ అడ్రస్ ఆధారంగా శుభం కుమార్ను కర్ణాటకలో గుర్తించి అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు. నిందితుడు తనకి ఉన్న కంప్యూటర్ పరిజ్ఞానంతో మహిళపై ఈ తరహా వేధింపులకు పాల్పడుతున్నట్టు పోలీసులు చెబుతున్నారు. శుభం కుమార్ బాధితులు ఎవరైనా వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చని సూచిస్తున్నారు.