కోవిడ్ తర్వాత ఆ కోర్సులకు భారీ డిమాండ్-ఏకంగా 67 శాతం పెరుగుదల..

భారత్ లో కరోనా మహమ్మారి రావడానికి కాస్త ముందు అంటే 2019 నుంచి చూసుకుంటే స్కిల్ కోర్సులకు డిమాండ్ భారీగా పెరుగుతున్నట్లు ఇంటర్న్ శాలా తాజా వార్షిక ట్రెండ్స్ రిపోర్ట్ వెల్లడించింది. 2019 నుంచి ఇప్పటివరకూ స్కిల్ కోర్సుల్లో నమోదైన విద్యార్ధుల సంఖ్య ఏకంగా 67 శాతం పెరిగినట్లు తన నివేదికలో తెలిపింది. ఇందులో ఆయా విద్యార్ధులు ఏయే కోర్సుల్ని ఎంచుకుంటున్నారో కూడా పేర్కొంది.


2019 నుంచి పెరుగుతున్న స్కిల్ కోర్సుల అభ్యసన విద్యార్ధుల సంఖ్య 67 శాతంగా ఉండగా.. ఇందులో వెబ్ డెవలప్‌మెంట్ 13 శాతం, డిజిటల్ మార్కెటింగ్ మరియు ఆప్టిట్యూడ్ తలో 8 శాతం పెరుగుదల నమోదు చేసాయి. 20 శాతం మంది విద్యార్థులు ప్లేస్‌మెంట్ తయారీ శిక్షణను అభ్యసించారు. ఇ-లెర్నర్లలో దాదాపు 60 శాతం మంది టైర్-2 మరియు టైర్-3 నగరాలకు చెందినవారు.టైర్-3 నగరాలకు చెందిన వారు మరో 40 శాతం ఉన్నారు.

ఢిల్లీ-ఎన్‌సీఆర్ 12 శాతం పెరుగుదల నమోదు చేయగా.. హైదరాబాద్ 7 శాతం, బెంగళూరు 6 శాతంతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2.55 శాతం మంది ప్రెషర్లు స్కిల్ స్పెషలైజేషన్ ట్రైనింగ్స్ ను కూడా ఎంచుకున్నారు. మహిళల్లో ఇ-లెర్నర్లు 45 శాతం ఉండగా.. పురుషుల్లో 55 శాతం ఉన్నారు. 2024లో శిక్షణ పూర్తి చేసుకున్న వారి రేటు 41 శాతం ఉంది. అలాగే 47 శాతం మంది ఉద్యోగాల కోసం, 34 శాతం నైపుణ్యాల కోసం, 12 శాతం సర్టిఫికెట్ల కోసం శిక్షణ పొందారని తేలింది. అభ్యాసకులు కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి ప్రతిరోజూ 36 నిమిషాలు గడిపారని ఈ నివేదిక తెలిపింది.