ఏపీ రాజధానిగా హైదరాబాద్.. బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు

ఏపీ రాజధానిగా ఉండాలని వైసీపీ నేతలు కోరుతున్న నేపథ్యంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉందన్నారు.
రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అవుతోందని.. ఇంకా రాజధాని హైదరాబాద్ అని అంటున్నారని మండిపడ్డారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పదేళ్లుగా ఉమ్మడి రాజధాని ఇస్తే టీడీపీ, వైసీపీ వదిలేశాయని విమర్శించారు. పదేళ్లుగా ఐదేళ్లుగా రాజధాని నిర్మాణంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికే కోర్టులో రాజధానికి సంబంధించి పలు కేసులు కోర్టులో ఉన్నాయని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటనతో ప్రజల్లో అయోమయం నెలకొందని తెలిపారు. ఇంకా హైదరాబాద్‌నే ఏపీ రాజధాని అనడం సరికాదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు పేర్కొన్నారు.


కాగా ప్రస్తుత పరిస్థితుల్లో రాజధాని నిర్మాణం చేపట్టలేమని సీఎం జగన్ బాబాయ్, వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. విశాఖ పాలనా రాజధాని అయ్యే వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగించాలని ఆయన తెలిపారు. దీంతో ప్రతిపక్ష పార్టీలు వైసీపీపై విమర్శలు చేస్తున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ సైతం స్పందించింది. ఏపీ రాజధానిగా ఇంకా హైదరాబాద్‌ను కొనసాగించాలనడం సరికాదని ఆ పార్టీ నేతలు అంటున్నారు.